Payyavula Keshav: ఆ సంస్థను కోర్టు పరిధిలోకి ఎందుకు తీసుకు రావడం లేదు?: చంద్రబాబు అరెస్ట్‌పై పయ్యావుల

  • ప్రశ్నించిన వారందర్నీ అరెస్ట్ చేస్తూ వెళ్తే వచ్చే ఎన్నికల్లో రెండు సీట్లకే పరిమితమన్న పయ్యావుల
  • ప్రాథమిక ఆధారాలు లేకుండానే చంద్రబాబును అరెస్ట్ చేశారన్న టీడీపీ ఎమ్మెల్యే
  • సీమెన్స్ సంస్థ ఫిర్యాదు చేసిందా? అని నిలదీత
Payyavula Keshav drags company into chandrababu arrest issue

ప్రశ్నించిన వారందర్నీ ఇలాగే అరెస్ట్ చేసుకుంటూ వెళ్తే వైసీపీ వచ్చే ఎన్నికల్లో రెండు సీట్లకే పరిమితమవుతుందని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ హెచ్చరించారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసు వ్యవహారంలో చంద్రబాబు అరెస్ట్‌పై బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాథమిక ఆధారాలు లేకుండానే కేసు నమోదు చేసి, చంద్రబాబును అరెస్ట్ చేశారన్నారు. కేవలం అవినీతి మరకను చంద్రబాబుకు అంటించాలనే ఉద్దేశంతోనే అరెస్ట్ చేశారన్నారు. ఇలాంటి అక్రమ కేసులకు చంద్రబాబు, టీడీపీ భయపడదని, రాజకీయ రణక్షేత్రంలో వారిని ఎదుర్కొంటామన్నారు.

సీమెన్స్ సంస్థ అద్భుతమైన పనితీరును కనబరిచిందని 2021లోనే వైసీపీ ప్రభుత్వం ప్రశంసించిందని, ఇంకోవైపు ఒప్పందం ప్రకారం సాఫ్టువేర్, హార్డ్‌వేర్ అన్నీ అందాయని చెబుతున్నారని, మరోవైపు నిధులు పక్కదారి పట్టాయని చెబుతూ.. వాటిని ఇప్పటి వరకు నిరూపించలేకపోయారన్నారు. చంద్రబాబుకు అవినీతి మరక అంటించాలనేది జగన్ కుట్ర అన్నారు. అసలు సీమెన్స్ సంస్థను కోర్టు పరిధిలోకి ఎందుకు తీసుకు రావడం లేదన్నారు.

ప్రభుత్వం, సీమెన్స్ సంస్థ, డిజైన్‌టెక్ ఒప్పందం చేసుకున్నాయని, కానీ సీమెన్స్‌ ఎలాంటి ఫిర్యాదు చేయలేదని గుర్తు చేశారు. అలాంటప్పుడు ఆ సంస్థను ప్రతివాదిగా ఎందుకు చేర్చలేదో చెప్పాలన్నారు. కనీసం ఒక్కరూపాయి అయినా పక్కదారి పట్టించిందని నిరూపించారా? అని ప్రశ్నించారు. ఈ నాలుగేళ్లలో ఏ ఒక్కరోజు నోటీసు ఇవ్వలేదన్నారు. చంద్రబాబు అరెస్టుకు కనీసం ప్రాథమిక ఆధారాలు కూడా లేవన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రజావ్యతిరేకతను దృష్టి మళ్లించేందుకే జగన్ ప్రయత్నిస్తున్నారన్నారు.

More Telugu News