భారత విద్యార్థిని కారుతో ఢీకొట్టి.. ఆమెకు పెద్దగా విలువ లేదన్న అమెరికన్ పోలీస్ ఆఫీసర్
- ఈ ఏడాది జనవరిలో ప్రమాదం
- కారు ఢీకొనడంతో ఏపీ విద్యార్థి జాహ్నవి మృతి
- దీనిపై పోలీసు అధికారులు బాధ్యతారాహిత్య సంభాషణలు
- రికార్డింగ్ టేప్ లు విడుదల చేసిన అమెరికన్ పోలీసులు
ఈ ఘటనపై సీటెల్ పోలీసు ఆఫీసర్స్ గిల్డ్ వైస్ ప్రెసిడెంట్ డానియల్ ఆడెరర్.. తన బాడీ కెమెరా రికార్డర్ ను ఆఫ్ చేయడం మర్చిపోయి.. ఆఫీసర్స్ గిల్డ్ ప్రెసిడెంట్ మైక్ సోలన్ కు కాల్ చేసి మాట్లాడారు. విద్యార్థిని కందుల జాహ్నవి మరణం ఎలా చోటు చేసుకుందో మైక్ సోలన్ కు రిపోర్ట్ చేయడానికి కాల్ చేశారు. ఈ సందర్భంగా డానియల్ ఆడెరర్ హ్హహ్హహ్హ అంటూ నవ్వుతూ కందుల ప్రాణానికి పెద్దగా విలువ లేదంటూ, ఓ చెక్ రాసిస్తే సరిపోతుందని చెప్పడం రికార్డర్ లో నమోదైంది. ఇందులో ఆఫీసర్ తప్పు ఏమీ లేదంటూ మాట్లాడాడు. ఈ ఘటనలో క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అవసరం లేదన్నట్టు ఉన్నతాధికారికి నివేదించాడు.
‘‘ఆమె 40 అడుగుల దూరంలోకి ఎగిరి పడిందని అనుకోవడం లేదు. కాకపోతే మరణించింది’’ అని చెప్పి ఆడెరర్ మరోసారి నవ్వాడు. ‘‘సాధారణ మనిషే. ఒక చెక్ రాస్తే సరిపోతుంది’’ అంటూ మరోసారి నవ్వాడు. ‘‘11వేల డాలర్లు, ఆమె వయసు 26 ఏళ్లు. ఆమెకు ఉన్న విలువ కొంచెమే’’ అని ఆడెరర్ మాట్లాడిన వ్యవహారం వెలుగు చూసింది. ఈ సంభాషణల రికార్డింగ్ టేపులను పోలీసులు విడుదల చేశారు. మనిషి ప్రాణం అంటే ఏ మాత్రం విలువ లేదన్నట్టు, చెక్ రాసి పడేస్తే చాలంటూ నవ్వడం.. సీటెల్ పోలీసుల మానసిక స్థాయిని కళ్లకు కడుతోంది. 11వేల డాలర్లు మన రూపాయిల్లో 9.13 లక్షలు. ఈ ఘటనపై విచారణ జరుగుతోంది.