Jada Sravan Kumar: నారా లోకేశ్ ను కలిసి సంఘీభావం ప్రకటించిన జడ శ్రావణ్

  • రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా చంద్రబాబు
  • రాజమండ్రి నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తున్న లోకేశ్
  • రాష్ట్రంలోని దళితులు చంద్రబాబుతోనే ఉన్నారన్న జడ శ్రావణ్
  • కుట్ర రాజకీయాలతో చంద్రబాబును అరెస్ట్ చేశారని ఆవేదన 
Jada Shravan met Nara Lokesh and express solidarity

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో అరెస్టయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా రాజమండ్రి నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. 

ఈ నేపథ్యంలో, జైభీమ్ భారత్ పార్టీ  అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ ఇవాళ నారా లోకేశ్ ను కలిసి సంఘీభావం ప్రకటించారు. రాష్ట్రంలోని దళితులు, ప్రజాస్వామ్యవాదులు చంద్రబాబుతోనే ఉన్నారని స్పష్టం చేశారు. తండ్రిని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టడాన్ని ఒక బిడ్డగా తట్టుకుని నిలబడటం కష్టమని, కానీ లోకేశ్ గుండె ధైర్యంతో ఉన్నారని ఈ సందర్భంగా శ్రావణ్ అన్నారు.  

"కుట్ర రాజకీయాలతో చంద్రబాబు అక్రమ అరెస్టుకు బలయ్యారు. చంద్రబాబు అరెస్ట్ తో సంబరాలు చేసుకునే మంత్రులు కూడా ఎన్నో ఫైల్స్ పై సంతకాలు చేశారు. వారు దోచుకున్న ప్రతి రూపాయినీ కక్కిస్తాం. వైసీపీ చేసిన ప్రతి దుర్మార్గానికి సమాధానం చెబుతాం. రాష్ట్రానికి సైంధవుడిలా జగన్ తయారయ్యారు. రాజకీయాలు ఎన్ని ఉన్నా ప్రజల హక్కుల కోసం మేమంతా కలిసి పోరాడుతాం" అని అన్నారు.

More Telugu News