శ్రీలంక కుర్ర స్పిన్నర్ ధాటికి తడబడిన టీమిండియా టాపార్డర్
- కొలంబోలో టీమిండియా వర్సెస్ శ్రీలంక
- ఆసియా కప్ సూపర్-4లో తలపడుతున్న ఇరు జట్లు
- 3 వికెట్లతో భారత్ ను దెబ్బకొట్టిన దునిత్ వెల్లాలగే
తొలుత శుభ్ మాన్ గిల్ ను బౌల్డ్ చేసిన ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్... ఆ తర్వాత సూపర్ ఫామ్ లో ఉన్న కోహ్లీ (3)ను అవుట్ చేసి లంక శిబిరంలో ఉత్సాహం నింపాడు. అదే ఊపులో, కెప్టెన్ రోహిత్ శర్మ (53)ను కూడా బౌల్డ్ చేయడంతో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. అర్ధసెంచరీ సాధించి టచ్ లో ఉన్నట్టు కనిపించిన రోహిత్ శర్మ... వెల్లాలగే విసిరిన ఆర్మ్ బాల్ ను అర్థం చేసుకోలేకపోయాడు.
అయితే, వెంటవెంటనే 3 వికెట్లు కోల్పోయిన టీమిండియాను ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్ జోడీ ఆదుకునే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం టీమిండియా స్కోరు 25 ఓవర్లలో 3 వికెట్లకు 128 పరుగులు కాగా... కిషన్ 18, రాహుల్ 18 పరుగులతో ఆడుతున్నారు.