Eluri Sambasiva Rao: ఓట్లు తొలగిస్తున్నారు.. చంద్రబాబు గురించి ఆందోళన చెందకుండా దానిపై దృష్టి పెట్టండి: ఏలూరి సాంబశివరావు

  • చంద్రబాబును అరెస్ట్ చేయడం తెలుగు జాతికే అవమానకరమన్న సాంబశివరావు
  • బాబును జైలుకు పంపాలని నాలుగేళ్లగా జగన్ యత్నిస్తున్నారని మండిపాటు
  • చంద్రబాబు అనుభవించిన బాధను జగన్ వంద రెట్లు అనుభవించేలా చేసేంత వరకు విశ్రమించకూడదని వ్యాఖ్య
Eluri Sambasiva Rao fires on Jagan

రాజకీయ కక్ష సాధించడం కోసం దేశం గర్వించే నాయకుడు చంద్రబాబును ముఖ్యమంత్రి జగన్ అక్రమంగా అరెస్ట్ చేశారని టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మండిపడ్డారు. ఎంతో నిజాయతీగా ఉండే పెద్దాయనను మానసికంగా హింసించడం, అరెస్ట్ చేయడం తెలుగు జాతికే అవమానకరమని అన్నారు. దీనికి జగన్ భారీ మూల్యాన్ని చెల్లించుకుంటారని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచీ చంద్రబాబుని ఏదో రకంగా తప్పుడు కేసుల్లో ఇరికించాలని అనేక ప్రయత్నాలు చేశారని... చిన్న తప్పు చేయని, ఎలాంటి అవినీతి మరక లేని చంద్రబాబుని ఏదో రకంగా జైలుకు పంపాలని నాలుగేళ్లుగా కలలుగన్న జగన్ రెడ్డి, చివరకు కుట్రపూరితంగా తాను అనుకున్నది చేశాడని అన్నారు. 


స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో అవినీతి జరిగిందని చెబుతున్న వైసీపీ ప్రభుత్వం, సీఐడీ... ఆనాడు సదరు ప్రాజెక్ట్ అమల్లో కీలకంగా వ్యవహరించి, ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న అజయ్ కల్లం, ప్రేమచంద్రారెడ్డిలను ఎందుకు విచారించలేదు? అని ప్రశ్నించారు. వారికి కేసుతో సంబంధం లేకపోతే చంద్రబాబుకి ఎలా సంబంధముంటుంది? దీన్ని బట్టే ఈ కేసులో ఉన్న కుట్రకోణం అర్థమవు తోందని అన్నారు. జగన్ రెడ్డిపై 11 సీబీఐ, 7 ఈడీ కేసులు, ఇతరత్రా కేసులు 20కి పైగా ఉన్నాయని... లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డాడనే ఆరోపణలతో పాటు, రూ.43 వేల కోట్ల అక్రమాస్తులు ఉన్నాయని ఈడీ నిర్ధారించిందని చెప్పారు. 5 వేల కోట్ల విలువైన ఆస్తుల్ని ఈడీ జప్తుచేసిందని.. అవినీతికి పాల్పడినట్టు నేరం నిరూపితమై 16 నెలలు జైల్లో ఉండి వచ్చాడని తెలిపారు. అలాంటి వ్యక్తి చంద్రబాబుని తప్పుడు మనిషిగా చిత్రీకరించడానికి వ్యవస్థల్ని దుర్వినియోగం చేసి, తాను అనుకున్నది సాధించాడని విమర్శించారు.

టీడీపీ అధినేతకు కలిగించిన బాధ, ఆవేదన కంటే వందరెట్లు మన ప్రత్యర్థికి కల్పించేవరకు విశ్రమించకూడదని, దుర్మార్గపు ప్రభుత్వంపై పోరాడటానికి అన్ని విధాలా సన్నద్ధం కావాలని టీడీపీ నేతలు, కార్యకర్తలకు పిలుపునిస్తున్నామని చెప్పారు. చంద్రబాబుతో మొదలైన అక్రమ అరెస్టుల పర్వం, గ్రామస్థాయి వరకు కొనసాగుతుందనడంలో ఆశ్చర్యం లేదని... ఎవరిని అరెస్ట్ చేసినా, ఎందరిని జైళ్లకు పంపినా, టీడీపీని ఎవరూ ఏమీచేయలేరని అన్నారు. గతవారం రోజుల్లో వైసీపీ ప్రభుత్వం ఫామ్-7 దరఖాస్తులు లక్షల సంఖ్యలో సృష్టించి, ఓట్లు తొలగించే తంతుని నిర్విరామంగా కొనసాగిస్తోందని మండిపడ్డారు. అధినేత గురించి ఆందోళన చెందకుండా టీడీపీ నేతలు, కార్యకర్తలు క్షేత్రస్థాయి నుంచే వైసీపీ దుర్మార్గాలను కట్టడి చేయాలని విన్నవించారు.

More Telugu News