Lalu Prasad Yadav: ప్రధాని మోదీ ఇచ్చిన ఆ ఆఫర్‌కు నేనూ లొంగిపోయా!: లాలూ ప్రసాద్ యాదవ్ వ్యంగ్యం

  • మోదీ రూ.15 లక్షలు ఇస్తారని బ్యాంకు ఖాతాను తెరిచానన్న లాలూ
  • తమ ఇంట్లో 11 మందికి రూ.15 లక్షల చొప్పున రావాలని వ్యాఖ్య
  • మోదీ హామీ నెరవేరలేదన్న మాజీ ముఖ్యమంత్రి
Lalu Prasad Yadav Rs 15 lakh jibe at PM Modi

ప్రధాని నరేంద్ర మోదీపై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. శుక్రవారం ముంబైలో I.N.D.I.A. కూటమి భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ప్రధానికి చురకలు అంటించారు. స్విస్ బ్యాంకుల నుండి డబ్బులు వెనక్కి తీసుకు వస్తానని, ఒక్కొక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తానని మోదీ చెప్పారని, దీంతో తాను కూడా ఈ ఆఫర్‌కు లొంగిపోయి బ్యాంకు ఖాతా తెరిచానని చమత్కరించారు. తన కుటుంబంలో ఉన్నవారి సంఖ్యతో అలాంటి పదకొండు ఖాతాలు తెరిచే అవకాశముందని, అలాంటప్పుడు రూ.15 లక్షల చొప్పున తన కుటుంబానికి ఎన్ని డబ్బులు వచ్చి ఉండాలని వ్యాఖ్యానించారు.

స్విస్ బ్యాంకుల నుండి డబ్బులు తీసుకువస్తానన్న మోదీ హామీ నెరవేరలేదన్నారు. తమ డబ్బు స్విస్ బ్యాంకుల్లో డిపాజిట్ అయిందంటూ తనతో సహా పలువురు నేతల పేర్లను బీజేపీ తీసుకుందన్నారు. అబద్ధాలు చెప్పి ఎన్డీయే అధికారంలోకి వచ్చిందన్నారు. ఇక ఇస్రో శాస్త్రవేత్తలు ప్రధాని మోదీని సూర్యుడి పైకి పంపించాలని వ్యంగ్యంగా అన్నారు. చంద్రయాన్ 3 విజయవంతం చేసిన శాస్త్రవేత్తలు మనదేశానికి గర్వకారణమని, కానీ మోదీ వారి పక్కన నిల్చోవడం కాదని, ఆయనను సూర్యుడి పైకి పంపించాలన్నారు.

More Telugu News