UP teacher: విద్యార్థిని ఎందుకు దండించాల్సి వచ్చిందో చెప్పిన యూపీ టీచర్

  • కఠినంగా ఉండాలని తల్లిదండ్రులు సూచించినట్టు వెల్లడి
  • పాఠశాలలో విద్యార్థులు అందరూ సమానమేనన్న టీచర్
  • వారిని హిందూ-ముస్లిం కోణంలో చూడరాదని హితవు
I made a mistake but not ashamed of it says UP teacher

చదువుల్లో చురుగ్గా లేని ఓ విద్యార్థిని, తోటి విద్యార్థులతో దండించి వార్తల్లోకెక్కిన యూపీ టీచర్ త్రిప్తా త్యాగి జరిగిన దానిపై తన స్పందన తెలియజేశారు. తరగతి గదిలో ఇతర మతానికి చెందిన విద్యార్థులతో చెంప దెబ్బలు కొట్టించడమే ఇప్పుడు ఇది సంచలనంగా మారడానికి కారణం. ఈ పరిణామంతో సదరు యూపీ స్కూల్ (నేహా పబ్లిక్ స్కూల్) గుర్తింపును ప్రభుత్వం రద్దు చేయడం తెలిసిందే. తాను చేసింది తప్పేనని అంగీకరించిన త్రిప్తా త్యాగి, అందుకు సిగ్గు పడడం లేదన్నారు. 

‘‘నేను పాఠశాలకు, సమాజానికి ఎన్నో ఏళ్లుగా సేవలు అందిస్తున్నాను. ఆ ప్రాంతంలో ప్రతి ఒక్కరూ (మస్లింలు సహా) నాతోనే ఉన్నారు’’ అని ఆమె చెప్పారు. తోటి విద్యార్థులతో దండించడాన్నే చూడాలి కానీ, హిందూ-ముస్లిం కోణంలో చూడొద్దని ఆమె కోరారు. పాఠశాలలో విద్యార్థులను హిందూ-ముస్లిం దృక్పథంతో చూడరాదని, విద్యార్థులు అందరినీ ఒక విధంగానే చూస్తామని చెప్పారు. 

‘‘సదరు విద్యార్థికి ఆ రోజు గుణకార పట్టికలు గుర్తుకు రాలేదు. విద్యార్థి పట్ల కఠినంగా ఉండాలని అతడి తల్లిదండ్రులు అంతకుముందే నాతో చెప్పారు. విద్యార్థులను క్రమశిక్షణగా ఉంచేందుకు టీచర్లు వారిని దూషించడం, అవసరమైతే చెంప దెబ్బలు వేయడం చేస్తుంటారు. వీటికి వ్యతిరేకంగా చట్టాలు ఉండొచ్చు. కానీ, కొన్ని సందర్భాల్లో విద్యార్థులకు కఠినమైన మార్గంలో బోధించాల్సి వస్తుంది’’ అని టీచర్ త్యాగి వివరించారు.

More Telugu News