Telangana congress: మరో డిక్లరేషన్​కు రెడీ అయిన టీ కాంగ్రెస్..​ ఖర్గేతో నేతల కీలక భేటీ

  • ఈ నెల 26న చేవెళ్లలో కాంగ్రెస్ బహిరంగ సభ
  • ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ ప్రకటించనున్న పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే
  • పార్టీ మార్పుపై పుకార్లను ఖండించిన ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి
Bhatti vikramarka calls on Congress chief  mallikarjun kharge

సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలోని తెలంగాణ కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ నేతలు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్లలో ఈ నెల 26న జరగనున్న బహిరంగ సభలో ప్రకటించబోయే ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ గురించి మాట్లాడారు. దాదాపు రెండు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో డిక్లరేషన్‌లో పొందుపరచాల్సిన అంశాలపై చర్చలు జరిపారు. అనంతరం మీడియాతో మాట్లాడిన భట్టి తాము క్షేత్ర స్థాయిలో పర్యటించి, ప్రజల నుంచి తీసుకున్న అభిప్రాయాలను, అన్ని అంశాలను ఖర్గే దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. 

అన్ని విషయాలను క్రోడీకరించి చేవెళ్ల సభలో ఖర్గే ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ ప్రకటిస్తారన్నారు. మరోవైపు పార్టీ మార్పుపై వస్తున్న ప్రచారాన్ని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖండించారు.  గత కొన్ని రోజులుగా తాను, తన భార్య పార్టీని వీడుతున్నామని వదంతులు, దుష్ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఏఐసీసీ, పీసీసీ ఎన్నికల కమిటీ ఆమోదంతో హుజూర్‌నగర్‌ నియోజకవర్గం నుంచి తాను, కోదాడ నుంచి పద్మావతి రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తెలిపారు.

More Telugu News