Pawan Kalyan: భీమిలి ఎర్రమట్టి దిబ్బలపై జగన్ ప్రభుత్వానికి 48 గంటల డెడ్‌లైన్ విధించిన పవన్ కల్యాణ్

  • టూరిజం ముసుగులో అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణ
  • కేంద్ర పర్యావరణ శాఖ దృష్టికి తీసుకు వెళ్తానని చెప్పిన జనసేనాని
  • తెలంగాణ తర్వాత ఉత్తరాంధ్రలో విధ్వంసం చేస్తున్నారని ఆగ్రహం
  • వారసత్వ ప్రదేశాల్లో ఎర్రమట్టి దిబ్బ ఒకటి అని గుర్తు చేసిన జనసేనాని
  • ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు ఆస్తుల్లా భావిస్తున్నారని వ్యాఖ్య
Pawan Kalyan at Bhimili Red sand hills

తెలంగాణలో పర్యావరణ విధ్వంసం చేశారని, ఇప్పుడు ఉత్తరాంధ్రలోను చేస్తున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. బుధవారం భీమిలి నియోజకవర్గంలో ధ్వంసానికి గురైన ఎర్రమట్టి దిబ్బలను పరిశీలించారు. అనంతరం జనసేనాని మాట్లాడుతూ... ఉత్తరాంధ్ర దోపిడీ ఆగిపోవాలని ఆకాంక్షించారు. ఆసియా ఖండంలో కేవలం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, శ్రీలంకలో మాత్రమే ఉన్న అరుదైన ప్రదేశం ఈ ఎర్రమట్టి దిబ్బలు అని, దాదాపు 20వేల సంవత్సరాల చరిత్ర కలిగిన అరుదైన ప్రాంతమని, వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. టూరిజం ముసుగులో అక్రమాలకు పాల్పడుతున్నారని, తాను ఈ విషయాన్ని కేంద్రపర్యావరణ శాఖ దృష్టికి తీసుకు వెళ్తానన్నారు.

32 భారత వారసత్వ ప్రదేశాల్లో ఈ ఎర్రమట్టి దిబ్బలు ఒకటిగా ఉందని గుర్తు చేశారు. 1200 ఎకరాల్లో ఉండే ఈ మట్టి దిబ్బలు ఈరోజు కేవలం 292 ఎకరాలు మాత్రమే మిగిలాయని, తెలిసో, తెలియకో కొంత ప్రాంతం రక్షణ శాఖకు ఇచ్చారని, మిగిలిన ప్రాంతాన్ని కూడా దోచేస్తున్నారని ఆరోపించారు.  మిగిలిన 292 ఎకరాల ఎర్రమట్టి దిబ్బల చుట్టూ కనీసం 30 ఎకరాల రక్షణ భూమి ఉండాలని, కానీ కనీసం 100 అడుగుల భూమి కూడా లేదన్నారు. చుట్టూ రక్షణ కంచెను ఏర్పాటు చేయాలన్నారు.

ఇందుకు ప్రభుత్వానికి 48 గంటల సమయం ఇస్తున్నానని, రక్షణ చర్యలు తీసుకుంటారో లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. చుట్టూ రియల్ ఎస్టేట్ వల్ల ఎర్రమట్టి దిబ్బలు కుంగిపోతున్నాయని, వాటికి కనీసం రక్షణ లేదని, మట్టి కనబడితే చాలు వైసీపీ నాయకులు దోచేస్తున్నారన్నారు. ఉత్తరాంధ్రలో ఇప్పటికే చాలా ప్రాంతాలు దోపిడీకి గురయ్యాయని, మిగిలిన 292 ఎకరాల ఎర్రమట్టి దిబ్బలను అయినా రక్షించుకోవలసిన అవసరం ఉందన్నారు. ఇవి మన వారసత్వ సంపద అన్నారు. వైసీపీ నేతలు ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు ఆస్తుల్లా భావిస్తున్నారని ఆరోపించారు.

  • Loading...

More Telugu News