Anantha Sriram: వైసీపీ శ్రేణులకు చెప్పిన విధంగానే అసత్య ప్రచారాలపై ఫిర్యాదు చేశాను: అనంత శ్రీరామ్

  • సోషల్ మీడియాలో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టులు
  • ఆ రాతల వెనుక ఉన్నది అనంత శ్రీరామ్ అంటూ ప్రచారం
  • ఖండించిన అనంత శ్రీరామ్
  • అమెరికా నుంచి రాగానే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని నాడు వైసీపీ శ్రేణులకు విజ్ఞప్తి
  • తాజాగా మాదాపూర్ డీసీపీ సందీప్ ను కలిసిన అనంత శ్రీరామ్
Anantha Sriram complains against rumors

ఇటీవల వైఎస్ రాజశేఖర్ రెడ్డికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వచ్చిన పోస్టుల వెనుక ఉన్నది లిరిక్ రైటర్ అనంత శ్రీరామ్ అంటూ ప్రచారం జరిగింది. 

పొలిటికల్ మిస్సైల్ అనే ఖాతాలో వైఎస్ రాజశేఖర్ రెడ్డిని విమర్శిస్తూ కొన్ని పోస్టులు దర్శనమివ్వగా, ఆ పోస్టుల్లోని రాతలు తన పనే అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అప్పట్లోనే అనంత శ్రీరామ్ తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. వీటిని నమ్మవద్దని అనంత శ్రీరామ్ వైసీపీ శ్రేణులకు విజ్ఞప్తి చేశాడు. తాను నాటా సభల కోసం అమెరికాలో ఉన్నానని, హైదరాబాద్ తిరిగిరాగానే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పాడు. 

ఈ నేపథ్యంలో, అనంత శ్రీరామ్ తాజాగా హైదరాబాదులో సైబర్ క్రైమ్ పోలీసులను కలిసి ఫిర్యాదు చేశాడు. ఈ విషయాన్ని తనే సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. 

"నేను వైసీపీ శ్రేణులకు కొన్నిరోజుల క్రితం చెప్పిన విధంగానే సోషల్ మీడియాలో జరిగిన అసత్య ప్రచారానికి కారకులైన వారిపై సైబర్ క్రైమ్ డిపార్ట్ మెంట్ కు ఫిర్యాదు చేశాను. మాదాపూర్ జోన్ డీసీపీ సందీప్ గారికి నా ఫిర్యాదు పత్రాన్ని అందించాను" అంటూ అనంత శ్రీరామ్ తెలిపాడు. ఈ మేరకు డీసీపీని కలిసినప్పటి ఫొటోను కూడా పంచుకున్నాడు.

More Telugu News