Vision 2047: మధ్యాహ్నం 3 గంటలకు వైజాగ్ బీచ్ రోడ్డులో కలుద్దాం.. చంద్రబాబు పిలుపు

  • ‘ఎక్స్’ వేదికగా స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు
  • ఈ శతాబ్దం ఇండియాదిగా అభివర్ణన
  • విజన్ 2047 దిశగా అడుగులు వేద్దామని పిలుపు
Will Meet On 3pm On Vizag Beach Road Chandrababu Calls

77వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు దేశ ప్రజలకు ‘ఎక్స్’ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్న భారతీయులకూ శుభాకాంక్షలు చెప్పిన చంద్రబాబు.. ఈ శతాబ్దం ఇండియాదిగా అభివర్ణించారు. 

మనం మన అద్భుతమైన విజయాలను ప్రతిబింబిస్తూ సామర్థ్యాన్ని వెలికితీసే ప్రయాణం కొనసాగాలని ఆకాంక్షించారు. ప్రపంచంలో యువతతో నిండిన దేశంగా మనకున్న ప్రయోజనాన్ని అవకాశంగా మలచుకోవాలని పేర్కొన్నారు. ప్రపంచ నాయకత్వానికి భారతదేశ మార్గం తిరుగులేనిదన్నారు. దేశ వందో స్వాతంత్ర్య దినోత్సవం కోసం లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని సూచించారు. కాబట్టి మనకు 2047 విజన్ అవసరమని స్పష్టం చేశారు. 

రాష్ట్రం అభివృద్ధి సాధిస్తే దేశం కూడా పురోగతి చెందుతుందని చంద్రబాబు అన్నారు. దేశాభివృద్ధిలో తెలుగు సమాజం కీలక పాత్ర పోషించగలదని పేర్కొన్నారు. దేశం కోసం అంతిమంగా 2047 కోసం నేడు వైజాగ్‌లో ఓ విజన్‌ను రూపొందిస్తూ ఉజ్వల భవిష్యత్తు వైపుగా అడుగులు వేద్దామని, మధ్యాహ్నం 3 గంటలకు వైజాగ్ బీచ్ రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద కలుసుకుందామని చంద్రబాబు పిలుపునిచ్చారు.

More Telugu News