Nara Lokesh: మా ఓపిక నశించింది... చంద్రబాబు ఆగమన్నా ఆగేది లేదు!: నారా లోకేశ్

  • ఇకపై మా అధినేత జోలికొస్తే యుద్ధమేనన్న లోకేశ్
  • ముఖ్యమంత్రి వీధిరౌడీ కావడంవల్లే మారణహోమం అని ఆగ్రహం
  • రిషాంత్ రెడ్డి లాంటి సైకోలను తమపై ఉసిగొల్పుతున్నారని వెల్లడి
  • వైసీపీ నేతల మాటలు విని వేధించే పోలీసులను వదలబోమని వార్నింగ్
  • ఉద్యోగాల నుంచి డిస్మిస్ చేసి, కటకటాల వెనక్కి పంపుతామని హెచ్చరిక 
  • వైసీపీ బాధితుల ముఖాముఖిలో నిప్పులు చెరిగిన లోకేశ్
Nara Lokesh held meeting with ruling party victms

ముఖ్యమంత్రి వీధి రౌడీ కావడం వల్లే ఆయనను ఆదర్శంగా తీసుకొని వైసీపీ సైకోలు రెచ్చిపోతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. 51 నెలల్లో 64 మంది టీడీపీ కార్యకర్తలను పొట్టనబెట్టుకున్నారని వెల్లడించారు. "వేలాది మందిపై తప్పుడు కేసులు బనాయించారు, ఇక మా ఓపిక నశించింది... చంద్రబాబు ఆగమన్నా ఆగేది లేదు" అంటూ లోకేశ్ నిప్పులు చెరిగారు. 

పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం దొడ్లేరులో వైసీపీ బాధితులతో లోకేశ్ ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ బాధితుల గోడు విని తీవ్రంగా చలించిపోయారు.

అనంతరం మాట్లాడుతూ... జగన్ రెడ్డి కులం ఫ్యాక్షనిజం, మతం సైకోయిజం అని విమర్శించారు. అందుకే రాష్ట్రంలో మారణహోమం సృష్టిస్తున్నాడని అన్నారు. "బ్యాంకులను ముంచేసి లక్ష కోట్లు దొబ్బి 14 నెలలు చిప్పకూడు తిన్న 420 ముఖ్యమంత్రి కావడం వల్లే టీడీపీ కేడర్ తో పాటు రాష్ట్ర ప్రజలు నరకం చూస్తున్నారు. 

మేం కార్యకర్తలను రెచ్చగొడుతున్నామని సజ్జల అంటున్నారు, మా వాళ్లను ఊచకోత కోస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? కేడర్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది. ఇక మా ఓపిక నశించింది... మా వాళ్ల జోలికొస్తే జరగబోయేది యుద్ధమే. 

రాష్ట్రంలో రాక్షస పాలనకు జగన్ శ్రీకారం చుట్టాడు... నేను ఫుల్ స్టాప్ పెడతాను. కార్యకర్తలను హతమార్చారు, తప్పుడు కేసులు పెట్టారు, ఇప్పుడు ఏకంగా మా అధినేతపైనే హత్యాయత్నం చేశారు, మరోసారి ఆయన జోలికొస్తే జరగబోయే పరిణామాలకు జగన్మోహన్ రెడ్డే బాధ్యత వహించాల్సి ఉంటుంది. 

చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడిచేసిన వాడికి, మమ్మల్ని బూతులు తిట్టేవారికి మంత్రి పదవులు ఇస్తున్నారు, దీని ద్వారా ప్రజలకు ఏమి సంకేతాలు ఇవ్వాలనుకుంటున్నారు? జగన్ ఒక సైకో... చిత్తూరు ఎస్పీ రిషాంత్ రెడ్డి లాంటి సైకోలను జిల్లాకు ఒకర్ని తయారు చేసి మా కార్యకర్తల పైకి ఉసిగొల్పుతున్నారు. 

వైసీపీ గూండాల మాటలు విని మా కేడర్ ను వేధించే పోలీసులను వదిలేది లేదు. 9 నెలల్లో అధికారంలోకి రాబోయేది మేమే. టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారిపై జ్యుడీషియల్ విచారణ జరిపి, ఉద్యోగాల నుంచి డిస్మిస్ చేస్తాం, తీవ్రతను బట్టి కటకటాల వెనక్కి కూడా పంపుతాం. వైసీపీ నేతలకు తొత్తులుగా మారి మా వాళ్లను ఇబ్బంది పెట్టిన వాళ్లు మూల్యం చెల్లించుకోక తప్పదు. 

కేసులకు కార్యకర్తలెవరూ భయపడాల్సిన పనిలేదు. నాపై 20 కేసులు ఉన్నాయి, జేసీ ప్రభాకర్ రెడ్డిపై 74 కేసులు బనాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే కేసులుపెట్టి, దాడులు పెడుతున్నారు. గతంలో బీహార్ లో ఇలాంటి పరిస్థితులు ఉండేవి, ఇప్పుడు జగన్ ఏపీని బీహార్ లా మార్చేశాడు. 

అధికారంలోకి రాగానే తెలుగుదేశం పార్టీ కేడర్ పై పెట్టిన తప్పుడు కేసులన్నీ ఎత్తేస్తాం. పసుపు సైనికులు ధైర్యంగా ఉండండి... ఈ లోకేశ్ మీకు అండగా నిలచి గుండెల్లో పెట్టుకొని కాపాడతాడు" అంటూ తీవ్రస్థాయిలో స్పందించారు.

More Telugu News