Haryana: హర్యానాలో అల్లర్లలో పాల్గొన్న వాళ్లకు ‘బుల్డోజర్’ ట్రీట్‌మెంట్.. 250కి పైగా గుడిసెల కూల్చివేత!

  • హర్యానాలోని నుహ్ జిల్లాలో ఇటీవల అల్లర్లు
  • అల్లర్లకు కారణమైన నిందితులపై చర్యలకు దిగిన రాష్ట్ర ప్రభుత్వం
  • అక్రమంగా నిర్మించిన నిందితుల గుడిసెల కూల్చివేత
  • రాళ్లదాడులు, దుకాణాల లూటీల్లోనూ వీళ్ల హస్తం ఉందన్న అధికారులు
Bulldozer Action In Nuh 250 Shanties On Illegally Occupied Land Razed

హర్యానాలోని నుహ్ జిల్లాలో ఓ వర్గం చేపట్టిన యాత్రను మరో వర్గానికి చెందిన యువకులు అడ్డుకోవడంతో అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ అల్లర్లు గురుగ్రామ్ సహా సమీప ప్రాంతాలకు విస్తరించాయి. కొన్ని రోజులుగా ఘర్షణలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో అల్లర్లకు కారణమైన నిందితులపై చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. 

నుహ్ జిల్లాలోని తవురులో అక్రమంగా నిర్మించిన 250 దాకా గుడిసెలను అధికారులు తొలగించారు. శుక్రవారం ఈ మేరకు భారీ ఎత్తున పోలీస్ దళాలను అక్కడ బందోబస్తులో ఉంచారు. బంగ్లాదేశ్‌ నుంచి గత నాలుగేళ్లలో చాలా మంది వలస వచ్చారని, ఇక్కడ స్థలాలను కబ్జాచేసి గుడిసెలను నిర్మించుకున్నారని అధికారులు చెబుతున్నారు.

వీరంతా అల్లర్లలో పాల్గొన్నారని వెల్లడిస్తున్నారు. రాళ్లదాడులు, దుకాణాల లూటీల్లోనూ వీళ్ల హస్తం ఉందని పేర్కొంటున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించామని అధికారులు చెప్పారు. దాడులు చేసిన వారి ఫొటోలు, వీడియోలను రిలీజ్ చేశారు. మరోవైపు నల్హార్‌‌ గ్రామంలోనూ కూల్చివేతలు జరిగాయి. భారీ సంఖ్యలో వాహనాలు దహనమైన ఈ గ్రామంలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చివేశారు.


More Telugu News