AI: కృత్రిమ మేధతో మహిళల ఉద్యోగాలకే ప్రమాదం ఎక్కువ!: తాజా అధ్యయనంలో వెల్లడి

  • అడ్మిన్ స్టాఫ్, సేల్స్ పర్సన్స్, క్యాషియర్స్ వంటి మహిళలకే పరిమితమైన ఉద్యోగాలు ఏఐతో భర్తీ
  • పురుషులకంటే మహిళలు 21 శాతం అధికంగా ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం
  • కొత్త నైపుణ్యాలతోనే రాబోయే మార్పులను దీటుగా ఎదుర్కొనే అవకాశం
  • మెక్సిన్సీ గ్లోబల్ నివేదికలో వెల్లడి
AI will replace more women employees than men by 2030

ఇటీవల కొత్తపుంతలు తొక్కుతున్న కృత్రిమ మేధ సాంకేతికతతో (ఏఐ) ఉద్యోగాల్లో కోత తప్పదన్న భయాందోళనలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. అయితే, ఏఐతో మహిళల ఉద్యోగాలకే అధికంగా ప్రమాదం ఉందని తాజాగా అమెరికాలో జరిగిన ఓ అధ్యయనంలో తేలింది. 2030 నాటికల్లా మహిళలకు పరిమితమైన చిన్న చిన్న ఉద్యోగాల్లో మెజారిటీ కృత్రిమ మేధతో భర్తీ చేస్తారని జోస్యం చెప్పింది. ప్రస్తుతం మహిళల కంటే పురుష ఉద్యోగులే అధికంగా ఉనప్పటికీ స్థూలంగా చూస్తే పురుషులకంటే మహిళలే 21 శాతం అధికంగా ఉద్యోగాలు కోల్పోతారని మెకిన్సీ గ్లోబల్ ఇన్‌స్టిట్యూట్ తన అధ్యయనంలో తేల్చింది. 

సంప్రదాయకంగా మహిళలకే పరిమితమైన సేల్స్ పర్సన్స్, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్లు, కాషియర్లు వంటి ఉద్యోగాల్లోని బాధ్యతలను కృత్రిమ మేథ సాంకేతికత సులువుగా చేసేస్తుందని చెప్పింది. అమెరికాలో ఈ వృత్తుల్లోని వారిపై పెను ప్రభావం పడుతుందని హెచ్చరించింది.

ఈ సమస్యకు పరిష్కారంగా సంస్థలు సర్టిఫికేట్ల కంటే నైపుణ్యాల అధారంగా ఉద్యోగులను ఎంపిక చేయాలని నివేదిక తేల్చింది. గ్రామీణ ప్రాంతాల వారు, వికలాంగులు, నిర్లక్ష్యానికి గురైన ఇతర వర్గాలకు తగిన శిక్షణ ఇచ్చి పనుల్లోకి తీసుకోవడంపై దృష్టి సారించాలని పేర్కొంది. తద్వారా మహిళా ఉద్యోగులపై ఏఐ ప్రభావాన్ని కొంత మేర తగ్గించవచ్చని సూచించింది. ఉద్యోగాల్లో రాబోయే మార్పులను ఎదుర్కొనేందుకు స్త్రీపురుషులు కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలని, ఏఐతో పాటూ ఇతర నూతన ట్రెండ్స్ ద్వారా వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించింది.

More Telugu News