Morgan Stanley: భారత మార్కెట్ కు బూస్ట్.. అప్ గ్రేడ్ చేసిన మోర్గాన్ స్టాన్లీ

  • ఓవర్ వెయిట్ కు రేటింగ్ పెంపు
  • భారత్ వృద్ధి అవకాశాలు మెరుగ్గా ఉన్నట్టు వెల్లడి
  • సంస్కరణలు, ఆర్థిక స్థిరత్వం సానుకూలతలుగా ప్రకటన
Morgan Stanley upgrades India rating to overweight downgrades China

ప్రముఖ అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ మోర్గాన్ స్టాన్లీ భారత ఈక్విటీ మార్కెట్ రేటింగ్ ను పెంచింది. భారత రేటింగ్ ను ‘ఓవర్ వెయిట్’ కు అప్ గ్రేడ్ చేసింది. అదే సమయంలో పొరుగు దేశం చైనా రేటింగ్ ను డౌన్ గ్రేడ్ చేసి ‘ఈక్వల్ వెయిట్’ ను ప్రకటించింది. ప్రస్తుతమున్న అంతర్జాతీయ ఆర్థిక వాతావరణంలో ఏ దేశానికి ఎలాంటి వృద్ధి అవకాశాలు ఉన్నాయనే విశ్లేషణ ఆధారంగా మోర్గాన్ స్టాన్లీ రేటింగ్ ల్లో మార్పులు చేసింది.

భారత రేటింగ్ ను అప్ గ్రేడ్ చేయడానికి పలు కారణాలను మోర్గాన్ స్టాన్లీ ప్రకటించింది. గత అక్టోబర్ తో పోలిస్తే భారత మార్కెట్ విలువలు తక్కువ తీవ్రతతోనే ఉన్నట్టు వివరించింది. కేంద్ర సర్కారు చేపడుతున్న సంస్కరణాత్మక చర్యలు, స్థూల ఆర్థిక స్థిరత్వం అనేవి బలమైన మూలధన వ్యయాలకు, మంచి ఫలితాలకు మద్దతుగా నిలుస్తున్నట్టు తెలిపింది. 

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్ డీఐ), పోర్ట్ ఫోలియో పెట్టుబడులు సానుకూలంగా ఉన్నాయని, భారత్ సంస్కరణలకు, స్థూల ఆర్థిక స్థిరత్వానికి కట్టుబడి ఉందన్న దానికి ఇవి సంకేతాలుగా పేర్కొంది. ఇతర వర్ధమాన దేశాలతో పోలిస్తే భారత్ కు స్థిరమైన, మెరుగైన వృద్ధి అవకాశాలు ఉన్నాయంటూ.. యువ జనాభా అధికంగా ఉండడం ఈక్విటీల్లోకి మరిన్ని పెట్టుబడుల రాకకు దోహదం చేస్తుందని తెలిపింది. 

మరోవైపు చైనా పట్ల జాగ్రత్తగా ఉండాలని ఇన్వెస్టర్లను హెచ్చరించింది. చైనా సర్కారు ఇటీవల ప్రకటించిన ఉద్దీపనల ప్యాకేజీతో అక్కడి మార్కెట్ ర్యాలీ చేసిన నేపథ్యంలో లాభాలు స్వీకరించి, అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

More Telugu News