Rahul Gandhi: తెల్లవారుజామునే కూరగాయల మార్కెట్‌లో రాహుల్ గాంధీ.. వ్యాపారులతో మాట్లాడిన కాంగ్రెస్ నేత.. ఇదిగో వీడియో!

rahul gandhi interacts with vegetable fruit vendors at delhis azadpur mandi
  • ఢిల్లీలోని ఆజాద్‌పూర్ మండీకు వెళ్లిన రాహుల్
  • మండీలో కలియదిరిగి.. కూరగాయలు, పండ్ల వ్యాపారులతో ముచ్చట
  • ధరలు, వాళ్ల కష్టనష్టాల గురించి ఆరా
దేశంలోని సమస్యలను తెలుసుకునేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రజలతో మమేకమవుతున్నారు. మెకానిక్‌లతో, ట్రక్కు డ్రైర్లతో, రైతులతో.. ఇలా అవకాశం చిక్కినప్పుడల్లా వారిని కలిసి మాట్లాడుతున్నారు. వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కూరగాయల మార్కెట్‌లో ఆయన ప్రత్యక్షమయ్యారు. 

ఈ రోజు తెల్లవారుజామున ఢిల్లీలో ఓ మార్కెట్ ను రాహుల్‌ ఆకస్మికంగా సందర్శించారు. ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్‌ అయిన ఆజాద్‌పూర్ మండీలో కలియదిరిగారు. కూరగాయలు, పండ్ల వ్యాపారులతో మాట్లాడారు. ధరల వివరాలను ఆరా తీశారు. ఇందుకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్ ట్వీట్ చేసింది. 

అంతకుముందు శనివారం రామేశ్వర్ అనే వ్యాపారి మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకుంటున్న వీడియోను రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. టమాట ధరలు ఎక్కువగా ఉన్నాయని, వాటిని కొనేందుకు తన దగ్గర డబ్బులు లేవని ఆ వ్యాపారి కన్నీళ్లు పెట్టుకున్నాడు. 

‘‘మేం వాటిని ఏ ధరకు విక్రయిస్తామో మాకే తెలియదు. అవి వర్షంలో తడిసిపోయినా, లేదా ఇంకేమైనా జరిగినా.. మేం మొత్తం నష్టపోతాం” అని చెప్పాడు. రోజుకు రూ.100 నుంచి రూ.200 కూడా రావడం లేదని వాపోయాడు.

‘‘ఈ 
దేశం రెండు వర్గాలుగా విడిపోయింది. ఓవైపు ప్రభుత్వ మద్దతు ఉన్న ధనికులు.. మరోవైపు ధరల పెరుగుదలతో ఇక్కట్లు పడుతున్న పేదలు ఉన్నారు. ధనికులు, పేదల మధ్య అంతరం పెరిగిపోతోంది. దీన్ని మనం మార్చాలి. ఈ కన్నీళ్లను తుడవాలి” అంటూ ఈ వీడియోపై రాహుల్ రాసుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే కూరగాయల మార్కెట్‌కు రాహుల్ వెళ్లినట్లు సమాచారం.
Rahul Gandhi
vegetable vendors
Delhi
azadpur mandi
Congress

More Telugu News