AP TS Opinion Poll: ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలను నిర్వహిస్తే.. ఏపీ, తెలంగాణల్లో ఫలితాలు ఇలా ఉంటాయి: ఇండియా టీవీ - సీఎన్ఎక్స్ సర్వే

  • వైసీపీ 18 సీట్లు, టీడీపీ 7 సీట్లు గెలుచుకుంటాయన్న సర్వే
  • వైసీపీ 4 సీట్లు కోల్పోతుందని వెల్లడి
  • తెలంగాణలో బీజేపీకి మరో 2 సీట్లు పెరుగుతాయన్న ఒపీనియన్ పోల్
India TV CNX opinion poll in Andhra Pradesh and Telangana

దేశ వ్యాప్తంగా అప్పుడే సార్వత్రిక ఎన్నికల హడావుడి మొదలయింది. ఎన్నికల్లో గెలుపొందడమే లక్ష్యంగా అన్ని పార్టీలు వ్యూహ, ప్రతివ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో ఇండియా టీవీ - సీఎన్ఎక్స్ సంస్థలు ఒపీనియన్ పోల్ నిర్వహించాయి. ఈ సర్వేలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి ఆసక్తికర అంచనాలు వెలువడ్డాయి. 


ఏపీలో వైసీపీ ఆధిక్యత కొనసాగుతుందని... అయితే, కొన్ని సీట్లను కోల్పోతుందని ఒపీనియన్ పోల్ తెలిపింది. ఇదే సమయంలో టీడీపీ పుంజుకుంటుందని వెల్లడించింది. ఏపీలోని మొత్తం 25 లోక్ సభ స్థానాలలో జగన్మోహన్ రెడ్డి పార్టీ 18 సీట్లను గెలుచుకుంటుందని తెలిపింది. గతంలో 22 సీట్లను గెలుచుకున్న వైసీపీ... ఇప్పటికిప్పుడు ఎన్నికలను నిర్వహిస్తే 4 సీట్లను కోల్పోతుందని చెప్పింది. ఇదే సమయంలో గత లోక్ సభ ఎన్నికల్లో కేవలం 3 సీట్లను మాత్రమే గెలుచుకున్న టీడీపీ... మరో 4 స్థానాలను కైవసం చేసుకుని... 7 స్థానాలను గెలుచుకుంటుందని తెలిపింది. 

తెలంగాణ విషయానికి వస్తే 17 లోక్ సభ స్థానాల్లో అధికార బీఆర్ఎస్ పార్టీ 8 స్థానాలను గెలుచుకుంటుందని ఒపీనియన్ పోల్ వెల్లడించింది. బీజేపీ ఆధిక్యతను పెంచుకోబోతోందని... కాషాయం పార్టీకి 6 సీట్లు వస్తాయని తెలిపింది. కాంగ్రెస్ రెండు, ఎంఐఎం ఒక స్థానంలో విజయం సాధిస్తాయని తెలిపింది. సర్వే ప్రకారం బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కో సీటును కోల్పోనున్నాయి. బీజేపీ 2 సీట్లను పెంచుకోనుంది. అయితే రాబోయే రోజుల్లో వివిధ పార్టీల మధ్య పొత్తులు ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపుతాయని వెల్లడించింది.

More Telugu News