Chiranjeevi: నా దృష్టిలో వైష్ణవి మరో జయసుధ: 'బేబి' సెలబ్రేషన్స్ లో చిరూ!

  • ప్రేమకథా చిత్రంగా వచ్చిన బేబి'
  • యూత్ నుంచి వచ్చిన అనూహ్యమైన రెస్పాన్స్ 
  • భారీ వసూళ్లను రాబట్టిన సినిమా 
  • మెగాస్టార్ ముఖ్య అతిథిగా జరిగిన సెలబ్రేషన్స్ 
  • వైష్ణవిని ప్రశంసలతో ముంచెత్తిన చిరూ
Baby movie mega cult Celebrations

ఈ ఏడాదిలో ఇంతవరకూ వచ్చిన తెలుగు సినిమాలలో, చాలా వేగంగా భారీ వసూళ్లను సాధించిన సినిమాలలో 'బేబి' ఒకటిగా నిలిచింది. మీడియం రేంజ్ బడ్జెట్ తో నిర్మితమై, స్టార్ హీరోల సినిమాలతో సమానంగా పరుగులు తీసిన సినిమాగా ఇది నిలిచింది. ఈ సినిమా చూసిన ప్రేక్షకులంతా వైష్ణవి చైతన్య నటనకి ఎక్కువ మార్కులు వేశారు. గతంలో జరిగిన ఈవెంట్స్ లో అల్లు అరవింద్ .. అల్లు అర్జున్ కూడా ఆమెపై ప్రశంసలు కురిపించారు. 

ఇక నిన్న రాత్రి చిరంజీవి ముఖ్య అతిథిగా ఈ సినిమా సక్సెస్ సెలబ్రషన్స్ ను 'మెగా కల్ట్ సెలబ్రేషన్స్' పేరుతో నిర్వహించారు. ఈ వేదికపై ఈ సినిమా టీమ్ ను చిరంజీవి ఎంతగానో అభినందించారు. ఈ సినిమా దర్శక నిర్మాతలను .. హీరోలుగా నటించిన ఆనంద్ దేవరకొండను .. విరాజ్ ను మెచ్చుకుంటూనే, వైష్ణవి చైతన్య నటనను ప్రశంసించారు. 

"వైష్ణవి పాత్ర .. ఆమె నటన ఈ సినిమాను నిలబెట్టేసింది. ఇటు డీగ్లామర్ గాను .. అటు గ్లామరస్ గాను ఆమె కనిపించిన తీరు .. వేరియేషన్ ను ఆమె చూపించిన విధానం గొప్పగా అనిపించాయి. చాలా సీన్స్ ను చూస్తూ, నటనలో ఈ అమ్మాయికి చాలా పరిణతి ఉందని నేను అనుకున్నాను. ఇదే ఆమె ఫస్టు సినిమా అని తెలిసి షాక్ అయ్యాను. 

ఈ సందర్భంలో నేను ఒక మాట చెబుతున్నాను .. నా మాట వ్యర్థం కాదు. మనకి సహజనటి జయసుధ గారు ఉన్నారు. ఎలాంటి పాత్రనైనా ఆమె ఎంతో అద్భుతంగా చేస్తారు. ఆమెను తలపిస్తూ ఆ స్థానంలోకి ఎవరు వస్తారా అనుకునేవాడిని. ఆ లక్షణాలు నాకు వైష్ణవిలో కనిపించాయి. ఆమె ఫ్యూచర్ నాకు కనిపిస్తోంది. ఎంతో సహజంగా నటించిన వైష్ణవికి మంచి భవిష్యత్తు ఉంది" అంటూ చెప్పుకొచ్చారు. 

More Telugu News