భారత బౌలర్ల విజృంభణ... విండీస్ కుదేల్
- బ్రిడ్జ్ టౌన్ లో భారత్ వర్సెస్ వెస్టిండీస్
- తొలి వన్డేలో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రోహిత్ శర్మ
- కెప్టెన్ నిర్ణయాన్ని నిలబెట్టిన భారత బౌలర్లు
- వెస్టిండీస్ 23 ఓవర్లలో 114 ఆలౌట్
తమ కెప్టెన్ నిర్ణయం సబబేనని నిరూపిస్తూ టీమిండియా బౌలర్లు ఇక్కడి కెన్సింగ్ టన్ ఓవల్ పిచ్ పై విజృంభించారు. విండీస్ ను 23 ఓవర్లలో 114 పరుగులకే కుప్పకూల్చారు. ముఖ్యంగా, స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా ధాటికి కరీబియన్ బ్యాట్స్ మెన్ విలవిల్లాడారు. వీరిద్దరూ పోటీలు పడి వికెట్లు తీయడంతో, విండీస్ బ్యాటర్లు ఇలా వచ్చి అలా వెళ్లారు.
కుల్దీప్ యాదవ్ 3 ఓవర్లలో కేవలం 6 పరుగులిచ్చి 4 వికెట్లు తీయడం విశేషం. అందులోనూ 2 మెయిడెన్ ఓవర్లున్నాయి. జడేజా 3 వికెట్లు పడగొట్టాడు. హార్దిక్ పాండ్యా 1, ముఖేశ్ కుమార్ 1, శార్దూల్ ఠాకూర్ 1 వికెట్ తీశారు.
విండీస్ ఇన్నింగ్స్ లో కెప్టెన్ షాయ్ హోప్ చేసిన 43 పరుగులే అత్యధికం. అలిక్ అథనేజ్ 22, ఓపెనర్ బ్రాండన్ కింగ్ 17, షిమ్రోన్ హెట్మెయర్ 11 పరుగులు చేశారు. మిగతా అంతా సింగిల్ డిజిట్ స్కోరుకు పెవిలియన్ చేరారు.