Vinukonda: వినుకొండలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ.. వైసీపీ ఎమ్మెల్యే కారుపై రాళ్ల దాడి.. గాల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు

  • అక్రమ మట్టి తవ్వకాలపై టీడీపీ శ్రేణుల నిరసన ర్యాలీ
  • పలువురిపై కేసులు పెట్టిన పోలీసులు
  • అక్రమ కేసులు పెట్టారంటూ మరోసారి నిరసన ర్యాలీ
  • కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్న టీడీపీ, వైసీపీ శ్రేణులు
  • వినుకొండలో ఇంటర్నెట్ బంద్
TDP and YSRCP workers fignt in Vinukonda and stones pelted on YSRCP MLA

పల్నాడు జిల్లా వినుకొండలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ హింసకు దారి తీసింది. వివరాల్లోకి వెళ్తే అక్రమ మట్టి తవ్వకాలకు వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు ఉదయం ర్యాలీని నిర్వహించాయి. ఈ క్రమంలో ర్యాలీలో పాల్గొన్న పలువురు టీడీపీ శ్రేణులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. తమపై అక్రమ కేసులు పెట్టారంటూ మరోసారి టీడీపీ శ్రేణులు నిరసన ర్యాలీని చేపట్టాయి. అదే సమయంలో టీడీపీ శ్రేణులకు పోటీగా వైసీపీ శ్రేణులు అక్కడకు చేరుకున్నాయి. 

ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఒకరిపై మరొకరు కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్నారు. వైసీపీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు కారుపై టీడీపీ శ్రేణులు రాళ్లు రువ్వాయి. ఇరు వర్గాల రాళ్ల దాడిలో 15 మంది గాయపడినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. ప్రస్తుతం వినుకొండలో ఇంటర్నెట్ ను బంద్ చేశారు. ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. అదనపు బలగాలను తరలించాలని ఉన్నతాధికారులను స్థానిక పోలీసులు కోరారు.

More Telugu News