Hyderabad: హైదరాబాద్‌లో రెడ్ అలర్ట్.. అత్యవసరమైతేనే బయటకు రావాలి

  • భారీ వర్షాల నేపథ్యంలో రెడ్ అలర్ట్ జారీ చేసిన జీహెచ్ఎంసీ
  • అత్యవసర పరిస్థితుల్లో 9000113667, 040-21111111 నెంబర్లకు ఫోన్ చేయాలని సూచన
  • ఐటీ ఉద్యోగుల లాగ్-ఔట్ వేళల మార్పు ఆగస్ట్ 1 వరకు పొడిగింపు
GHMC High alert in Hyderabad area

హైదరాబాద్ సహా తెలంగాణ ప్రాంతంలో భారీ వర్షం నేపథ్యంలో హైదరాబాద్ వాసులను జీహెచ్ఎంసీ అప్రమత్తం చేసింది. ఈ మేరకు నగరంలో హైఅలర్ట్ జారీ చేసింది. నగరవాసులు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు సూచించారు. ఏదైనా అవసరమైతే 9000113667, 040-21111111 నెంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. నగరవాసులకు ఎస్సెమ్మెస్ లు పంపించి జీహెచ్ఎంసీ అప్రమత్తం చేసింది. సోషల్ మీడియా, మీడియా ద్వారా అప్రమత్తం చేస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా వాయుగుండం ప్రభావంతో బుధ, గురువారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న ఇరవై నాలుగు గంటల్లో తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశముందని వెల్లడించింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర సూచించారు.

ఇదిలా ఉండగా, భారీ వర్ష సూచన నేపథ్యంలో ఐటీ ఉద్యోగుల పనివేళల్లో మార్పులు చేసిన విషయం తెలిసిందే. లాగ్-ఔట్ ను మూడు ఫేజ్ లుగా విభజించింది. దీనిని తొలుత ఈ రోజు వరకు పరిమితం చేయగా, ఇప్పుడు ఆగస్ట్ 1 వరకు పొడిగించారు. 

మూడు దశల్లో ఐటీ ఉద్యోగులు లాగ్-ఔట్ కావాలి. ఐకియా నుండి సైబరాబాద్ టవర్స్ వరకు ఉండే ఐటీ కార్యాలయాలు సాయంత్రం మూడు గంటలకు, ఐకియా నుండి బయో డైవర్సిటీ, రాయదుర్గం వరకు ఉంటే కార్యాలయాలు సాయంత్రం గం.4.30కు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఉండే ఐటీ కార్యాలయాల ఉద్యోగులు సాయంత్రం మూడు గంటలకు లాగ్ ఔట్ చేయాలని సూచించారు.

More Telugu News