Raghunandan Rao: ఐఏఎస్ స్మితా సభర్వాల్ కు రఘునందన్ రావు కౌంటర్

  • మణిపూర్ లో మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై స్మితా సభర్వాల్ ట్వీట్
  • బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరిగే ఘటనలపై సత్వరమే స్పందిస్తారన్న రఘునందన్
  • నల్గొండ జిల్లాలో మహిళా సర్పంచ్ పై జరిగిన దాడిపై కూడా స్పందించాలని డిమాండ్
Raghunandan Rao counter to Smita Sabharwal tweet

మణిపూర్ లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి ఆ తర్వాత వారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడటం దేశ వ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై తెలంగాణ ఐపీఎస్ అధికారిణి స్మితా సభర్వాల్ కూడా ట్విట్టర్ ద్వారా స్పందించారు. చరిత్రలో ఎలాంటి కలహాలు జరిగినా మహిళలు నిస్సహాయ స్థితిలో నిలుస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మణిపూర్ లోని హింసాకాండలో నిస్సహాయులైన అమాయక మహిళలను నగ్నంగా ఊరేగించి అత్యాచారం చేశారని చెప్పారు. ఇంత జరుగుతుంటే మీడియా ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఈ ట్వీట్ కు రాష్ట్రపతిని కూడా ట్యాగ్ చేశారు. రాజ్యాంగపరమైన అధికారాలను అమలు చేయాలని కోరారు. 


ఈ ట్వీట్ కు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కౌంటర్ ఇచ్చారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరిగే ఘటనలపై స్మితా సభర్వాల్ సత్వరమే స్పందిస్తుంటారని... మీరు బాధ్యతలను నిర్వర్తిస్తున్న తెలంగాణలో జరిగిన దుర్ఘటనపై కూడా స్పందించాలని కోరుకుంటున్నామని చెప్పారు. నల్గొండ జిల్లాలో ఒక దళిత మహిళా సర్పంచ్ పై రక్తం వచ్చేలా దాడి చేశారని... దీనిపై స్పందించాలని డిమాండ్ చేశారు.

More Telugu News