Virat Kohli: రెండో టెస్టులోనూ దూసుకెళ్తున్న భారత్.. సెంచరీకి చేరువలో కోహ్లీ

Second Test Against West Indies India Scores 288 Runs For 4 In First Day
షార్ట్స్‌లో చూడండి
విండీస్ తో జరుగుతున్న రెండో టెస్టులోనూ టీమిండియా జోరు కనబరుస్తోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 288 పరుగులు సాధించింది. విరాట్ కోహ్లీ (87), రవీంద్ర జడేజా (36) క్రీజులో ఉన్నారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ తొలి వికెట్‌కు 139 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పింది. తొలి టెస్టు సెంచరీ (171) హీరో యశస్వి జైస్వాల్ రెండో టెస్టులో అర్ధ సెంచరీ (57) సాధించి ఓపెనర్‌గా తొలి రెండు టెస్టుల్లోను అత్యధిక పరుగులు సాధించిన రెండో ఇండియన్ క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. 

ఈ జాబితాలో టీమిండియా సారథి రోహిత్ శర్మ 303 పరుగులతో ప్రపంచంలోనే అందరికంటే ముందున్నాడు. తర్వాతి స్థానంలో సిడ్నీ బార్న్స్ (265), డేవిడ్ లాయిడ్ (260), బిల్ వుడ్‌పుల్ (258), నిశాన్ మధుశంక (234) వరుసగా తర్వాతి స్థానాలలో ఉన్నారు. ఇండియన్ క్రికెటర్లలో మాత్రం రోహిత్ తర్వాతి స్థానంలో సౌరభ్ గంగూలీ (267) ఉన్నాడు. శిఖర్ ధావన్ (210) ఇప్పటి వరకు మూడో స్థానంలో ఉండగా, ఇప్పుడా స్థానాన్ని యశస్వి (228) భర్తీ చేశాడు.

ఇక, రెండో టెస్టులో రోహిత్ శర్మ 80 పరుగులు చేసి వారికన్ బౌలింగులో బౌల్డయ్యాడు. శుభమన్ గిల్ (10), అజింక్య రహానే (3) మరోమారు దారుణంగా విఫలమయ్యారు. కోహ్లీ సెంచరీకి చేరువలో ఉన్నాడు. విండీస్ బౌలర్లలో కేమర్ రోచ్, షనాన్ గాబ్రియల్, జోమెల్ వారికన్, జాసన్ హోల్డర్ చెరో వికెట్ తీసుకున్నారు.
Go Back to Shorts
Virat Kohli
Yashasvi Jaiswal
Team India
West Indies

More Telugu News