Roja: పొత్తు పెట్టుకోవడానికి కొత్త పార్టీలు లేక.. మళ్లీ టీడీపీతోనే కలిశాడు: రోజా

  • పవన్ దళపతి కాదు.. దళారి అన్న రోజా
  • చంద్రబాబు కోసం ఢిల్లీలో దళారిగా మారారని ఎద్దేవా
  • కాంగ్రెస్ ను కూడా చంద్రబాబు మోసం చేశారని విమర్శ
Shamelessly Pawan Kalyan again joined hands with TDP says Roja

జనసేనాని పవన్ కల్యాణ్ పై ఏపీ మంత్రి రోజా మరోసారి విమర్శలు గుప్పించారు. పవన్ దళపతి కాదని, ఆయన దళారి అంటూ విమర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబు కోసం ఢిల్లీలో దళారిగా మారారని వ్యాఖ్యానించారు. తన తల్లిని తిట్టిన వ్యక్తి కోసం పవన్ దళారిగా మారడం సిగ్గుచేటని చెప్పారు. 

వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేసే అవకాశం ఉందని పవన్ ఢిల్లీలో చెప్పిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై రోజా స్పందిస్తూ... మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తామని సిగ్గులేకుండా చెప్పారని అన్నారు. పొత్తు పెట్టుకోవడానికి కొత్త పార్టీలు లేక మళ్లీ టీడీపీతోనే పొత్తు పెట్టుకున్నారని దుయ్యబట్టారు.

మోదీని తిట్టిన చంద్రబాబును ఎన్డీయే సమావేశానికి పిలవలేదని... కానీ, తన తల్లిని తిట్టించిన చంద్రబాబు కోసం పవన్ ఎన్డీయేతో కలిసిపోయాడని రోజా విమర్శించారు. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోను అంటూ గతంలో ప్రగల్బాలు పలికిన పవన్... ఇప్పుడు సిగ్గు లేకుండా అందరి కాళ్లు పట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఊసరవెల్లి అనే విషయం బీజేపీకి తెలుసని... అందుకే ఎన్డీయే సమావేశానికి పిలవలేదని చెప్పారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేస్తానని చెప్పిన చంద్రబాబు... చివరకు కాంగ్రెస్ ను కూడా మోసం చేశారని అన్నారు.

  • Loading...

More Telugu News