Y Venugopala Rao: బిగ్ బాస్-7లో క్రికెటర్ వేణుగోపాలరావు ఎంట్రీ ఇస్తున్నాడా...?

  • త్వరలో బిగ్ బాస్ ఏడో సీజన్
  • బిగ్ బాస్ ఇంట్లో తొలిసారిగా ఓ క్రికెటర్ అంటూ ప్రచారం
  • మీడియాలో కథనాలు
Bigg Boss 7 may host a cricketer this time as per reports

తెలుగు బుల్లితెరపై రియాలిటీ షోకి కొత్త నిర్వచనం ఇచ్చిన కార్యక్రమం బిగ్ బాస్. ఇప్పటివరకు 6 సీజన్లు పూర్తిచేసుకున్న తెలుగు బిగ్ బాస్ ఏడో సీజన్ లోకి అడుగుపెడుతోంది. త్వరలోనే కొత్త సీజన్ ప్రారంభం కానుందని స్టార్ మా చానల్ ప్రోమోలు వదులుతోంది. 

కాగా, ఈసారి బిగ్ బాస్ ఇంట్లో అడుగుపెట్టే కంటెస్టెంట్లు వీళ్లేనంటూ పలు జాబితాలు సందడి చేస్తున్నాయి. తెలుగు బిగ్ బాస్ మొదలైనప్పటి నుంచి సినిమా, టీవీ, యూట్యూబ్ రంగాల వారే కంటెస్టెంట్లుగా ఉంటున్నారు. అయితే, తొలిసారిగా బిగ్ బాస్ ఏడో సీజన్ లో ఓ క్రికెటర్ ఎంట్రీ ఇస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. 

టీమిండియాకు ఆడిన తెలుగు క్రికెటర్ వై.వేణుగోపాలరావు ఈ సీజన్ లో బిగ్ బాస్ కంటెస్టెంట్ అయ్యే అవకాశాలున్నాయని కథనాలు వస్తున్నాయి. బిగ్ బాస్ టీమ్ కూడా ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టిందట. 

క్రికెటర్ గా రిటైరయ్యాక వేణుగోపాలరావు తెలుగు కామెంటేటర్ గా బిజీ అయ్యాడు. స్టార్ స్పోర్ట్స్ చానల్లో ప్రసారమయ్యే టీమిండియా మ్యాచ్ లకు, ఐపీఎల్ పోటీలకు తెలుగు కామెంటేటర్ల బృందంలో వేణుగోపాలరావు తప్పనిసరిగా ఉండాల్సిందే. 

అయితే, బిగ్ బాస్ లోకి వేణు ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుందనేది ఆసక్తి కలిగిస్తోంది. బిగ్ బాస్-7లో పాల్గొనే కంటెస్టెంట్లు ఎవరన్నది షో ప్రారంభ ఎపిసోడ్ ద్వారానే అధికారికంగా తెలుస్తుంది కాబట్టి మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.

More Telugu News