Andhra Pradesh: వారాహి యాత్ర భేటీకి సరికొత్త పాసులు

  • రూపాయి నోటు నకలుపై జనసేన స్టాంప్
  • నకిలీ పాసుల బెడద లేకుండా తయారీ
  • జనసేన కేంద్ర కార్యాలయం నుంచి పంపిణీ
New Entry Pass to Varahi Yatra

జనసేనాని పవన్ కల్యాణ్ కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఆయనను చూసేందుకు అభిమానులతో పాటు సాధారణ ప్రజలు కూడా ఉత్సాహం చూపిస్తుంటారు. పవన్ కల్యాణ్ హాజరయ్యే కార్యక్రమాలకు వెళ్లేందుకు పాసుల కోసం ఎంత ఖర్చుకైనా వెనుదీయరు. దీనిని కొంతమంది మోసగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. జనసేనాని కార్యక్రమాలకు ఇచ్చే ఎంట్రీ పాసులకు నకిలీలు సృష్టిస్తున్నారు. ఈ బెడద తప్పించేందుకు జనసేన పార్టీ వినూత్నంగా ఆలోచించింది. రూపాయి నోటును పోలిన పాసులను తయారు చేసింది. అచ్చంగా రూపాయి నోటులానే ఉండే ఈ పాస్ పై జనసేన స్టాంప్ ను ముద్రించి పంచుతోంది. తాజాగా గురువారం తణుకులో జరిగిన వీరమహిళల సమావేశానికి ఈ పాసులనే ఉపయోగించారు.

రెండో విడత వారాహి విజయయాత్రలో భాగంగా పవన్ గురువారం తణుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ నియోజకవర్గ నాయకులు జనసేనానితో వీరమహిళల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే వారికి కొత్త పాసులను పంపిణీ చేశారు. ఈ పాసులు జనసేన కేంద్ర కార్యాలయం నుంచే వచ్చినట్లు స్థానిక నేతలు వెల్లడించారు. నకిలీ పాసుల బెడద తప్పించేందుకు పార్టీ పెద్దలు ఈ కొత్త పాసులను తయారు చేశారని వివరించారు.

More Telugu News