Payyavula Keshav: ఇది భారీ కుంభకోణం... సూత్రధారులు, పాత్రధారులు బయటికి రావాల్సిందే: పయ్యావుల

  • సీమ కరవు నివారణ ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి తెరలేపారన్న పయ్యావుల
  • లిఫ్ట్ ఇరిగేషన్ పనుల పేరిట రూ.3 వేల కోట్లు అప్పు తెచ్చారని వెల్లడి
  • కార్పొరేషన్ ఖాతాలో ఒక్క రూపాయి పడలేదని ఆరోపణ
  • కాంట్రాక్టర్ కు రూ.900 కోట్లు నేరుగా చెల్లించారని స్పష్టీకరణ
  • సీబీఐ విచారణ జరగాల్సిందేనని డిమాండ్
Payyavula Keshav alleges AP govt done a scam

సీమ కరవు నివారణ ప్రాజెక్టుల పేరుతో వైసీపీ ప్రభుత్వం భారీ దోపిడీకి తెరదీసిందని టీడీపీ సీనియర్ నేత, ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ పయ్యావుల కేశవ్ ఆరోపించారు. లిఫ్ట్ ఇరిగేషన్ పనుల పేరిట రూ.3 వేల కోట్ల అప్పు తెచ్చారని వెల్లడించారు. ప్రాజెక్టులకు ఎలక్ట్రో మెకానికల్ పనుల కోసమని పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం అప్పులు తెచ్చిందని తెలిపారు. 

అయితే ఆ అప్పులో రూ.900 కోట్లు నేరుగా ప్రైవేటు కాంట్రాక్టర్ కు చెల్లించారని పయ్యావుల వివరించారు. ఓ కార్పొరేషన్ అప్పు చేసినప్పుడు నిధులు ఆ కార్పొరేషన్ ఖాతాలోకే రావాలని, అలాకాకుండా, నేరుగా కాంట్రాక్టర్లకు చెల్లించే కొత్త విధానాన్ని ఏపీ ప్రభుత్వం మొదలుపెట్టిందని దుయ్యబట్టారు.

దీని ద్వారా, రేపు ఎవరు ఎక్కడ అప్పులు చేస్తారు? ఎవరి అకౌంట్లోకి ఆ డబ్బు వెళుతుందన్నది తెలిసే అవకాశం లేదని పయ్యావుల విమర్శించారు. కానీ, అప్పులు తీర్చేటప్పుడు మాత్రం ప్రభుత్వ ఖజానాలో ప్రజల డబ్బు నుంచే చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. ఇప్పటికే ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లింపులు మొదలయ్యాయని స్పష్టం చేశారు. 

"ప్రభుత్వ కార్పొరేషన్ ఖాతాలోకి ఒక్క రూపాయి రాకపోగా, అప్పులు మాత్రం తిరిగి చెల్లించడం ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం తెరదీసిన ఈ భారీ కుంభకోణంలో పాత్రధారులు, సూత్రధారులు వెలుగులోకి రావాల్సిన అవసరం ఉంది. అప్పు ఇచ్చిన ఆర్ఈసీ, పీఎఫ్ సీ కూడా ఇందులో బాధ్యులే. 

ఏపీ ప్రభుత్వం రూ.1.80 లక్షలతో సామాన్యుడికి ఇల్లు కట్టించి ఇచ్చేటప్పుడే, గుంతల వద్ద, పునాదుల వద్ద, శ్లాబ్ వేసే సమయంలో ఫొటోలు తీయించుకుంటేనే బిల్లులు విడుదల చేస్తుంది. రూ.1.80 లక్షల కోసం ఇన్ని నిబంధనలు పెట్టే ప్రభుత్వం... రూ.900 కోట్ల మళ్లింపు చేసేటప్పుడు ప్రతిపాదిత ఎలక్ట్రో మెకానికల్ వర్క్స్ జరిగాయా? లేదా? అనేది రాష్ట్ర ప్రభుత్వం గానీ, ఆర్ఈసీ, పీఎఫ్ సీ గానీ నిర్ధారించుకున్నాయా? అని నేను అడుగుతున్నా. ఇది అతి భారీ స్కాం కాదా? 

ప్రాజెక్టుల్లో పనులు ఎక్కడ జరిగాయో ప్రభుత్వం చూపించాల్సిందే. ఈ కుంభకోణంలో ఎవరెవరున్నారో బయటికి రావాలంటే సీబీఐ విచారణ జరగాల్సిందే" అంటూ పయ్యావుల కేశవ్ డిమాండ్ చేశారు.

More Telugu News