రాష్ట్ర ప్రజల గుండెల్లో కేవలం టీఎంసీ మాత్రమే ఉందని రుజువైంది: పంచాయతీ గెలుపుపై మమతా బెనర్జీ

TMC resides in heart of bengalies says Mamata Banerjee
  • బీజేపీ తమపై తప్పుడు ప్రచారం చేసిందని మమత ఆగ్రహం
  • పార్టీ పట్ల ప్రజలు చూపుతున్న ప్రేమ, ఆప్యాయత, మద్ధతుకు ధన్యవాదాలు తెలిపిన సీఎం
  • ఈ గెలుపు బెంగాల్ ప్రజలదేనని వ్యాఖ్య  
పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఈ గెలుపుపై ఆ పార్టీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం స్పందించారు. పంచాయతీ ఎన్నికల్లో తమను గెలిపించినందుకు బెంగాల్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ తమపై తప్పుడు ప్రచారం చేసిందన్నారు. తమ గెలుపుకు తోడ్పడిన ప్రతిపక్షాలకూ థ్యాంక్స్ చెప్పారు. ఫేస్ బుక్‌లోను ఆమె ఓ పోస్ట్ పెట్టారు. గ్రామీణ బెంగాల్ టీఎంసీదేనని, పార్టీ పట్ల ప్రజలు చూపుతున్న ప్రేమ, ఆప్యాయత, మద్దతుకు ధన్యవాదాలు అన్నారు. రాష్ట్ర ప్రజల గుండెల్లో కేవలం టీఎంసీ మాత్రమే ఉందని ఈ పంచాయతీ ఎన్నికలు రుజువు చేశాయన్నారు. ఈ గెలుపు బెంగాల్ ప్రజలదే అన్నారు.

కాగా, బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో 63,229 గ్రామపంచాయతీలకు గాను నేటి ఉదయం ఎనిమిది గంటల వరకు 34,359 స్థానాల్లో తృణమూల్ విజయం సాధించింది. 752 చోట్ల ముందంజలో ఉంది. 9,545 గ్రామపంచాయతీలను గెలుచుకొని బీజేపీ రెండో స్థానంలో ఉంది. కమలం పార్టీ 180 చోట్ల రెండో స్థానంలో ఉంది. సీపీఐ(ఎం) 2885 స్థానాలు గెలిచి, 96 చోట్ల ముందంజలో, కాంగ్రెస్ 2,498 చోట్ల గెలిచి, 72 స్థానాల్లో ముందంజలో వున్నాయి. 

పంచాయతీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ... ఇప్పటికే ఎన్నికలు ఒక ప్రహసనంగా మారాయని చెప్పవచ్చునని, ఈ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే భయంకరమైన పరిస్థితిని చూశారన్నారు. ఎన్నికల సమయంలో దారుణ హింస చోటు చేసుకుందని, దీంతో 40 మంది వరకు మృతి చెందారన్నారు. అధికార పార్టీ, పోలీసులు మధ్య అనుబంధం వెల్లడైందని, బెదిరింపులు చోటు చేసుకున్నాయన్నారు.
Go Back to Shorts
Mamata Banerjee
tmc
West Bengal
Congress
BJP

More Telugu News