YS Jagan: అసైన్డ్ లాండ్స్ పై రైతులకు పూర్తి హక్కులు: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

  • లంక భూముల విషయంలో కూడా రైతులకు అనుకూలంగా నిర్ణయం
  • దేవాదాయ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపు
  • అర్చకులకు నో రిటైర్మెంట్!
  • విశాఖ భూముల అక్రమాలపై సిట్ రిపోర్టుకు ఆమోదం
AP cabinet key decisions on Wednesday

ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన బుధవారం ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం భేటీ అయింది. ఈ సందర్భంగా కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మూడున్నర గంటల పాటు సాగిన కేబినెట్ భేటీలో 55 అంశాలపై చర్చించారు. జగనన్న విదేశీ విద్యా పథకంతో పాటు వివిధ పథకాలను చేపట్టనున్నారు. జులైలో చేపట్టబోయే సంక్షేమ పథకాలు 18న జగనన్న తోడు నిధుల జమ, 20న సీఆర్డీఏ, ఆర్-5 జోన్ లలో ఇళ్ల నిర్మాణ పనుల ప్రారంభం, 26న సున్నా వడ్డీకే డ్వాక్రా మహిళలకు డబ్బు జమ, 28న జగనన్న విదేశీ విద్యా పథకం చేపట్టనున్నారు.

అసైన్డ్ ల్యాండ్స్ విషయంలో కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. అసైన్డ్ ల్యాండ్స్ ఉన్న రైతులకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. అసైన్డ్ ల్యాండ్స్ పొందిన లబ్ధిదారులు భూమిని పొందిన 20 ఏళ్ల తర్వాత పూర్తి హక్కులు అనుభవించేలా కేబినెట్ పచ్చజెండా ఊపింది. ఇతర రైతుల మాదిరిగా వారికి క్రయ, విక్రయాలపై పూర్తి హక్కులు ఇచ్చింది. మొత్తం 63,191.84 ఎకరాల ‌అసైన్డ్ ల్యాండ్స్ ఉన్నాయి. లంక భూముల విషయంలో 66,111 మందికి పూర్తి హక్కులు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఒరిజినల్ అసైనీలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఒరిజినల్ అసైనీలు కాలం చేస్తే వారి వారసులకు ఇది వర్తిస్తుంది.

గ్రామాల్లో కులవృత్తులు చేసుకునే వారికి ఇచ్చిన ఇనామ్ భూములను నిషేధిత జాబితా నుండి తొలగించేందుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. దీంతో 1.13 లక్షల మంది బీసీలకు ప్రయోజనం చేకూరనుంది. 1966 రెవెన్యూ గ్రామాల్లో ఎస్సీలకు శ్మశాన వాటికల ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దేవాదాయ శాఖ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును 62 ఏళ్లకు పెంచుతోంది. అర్చకులకు తీపి కబురు చెప్పింది. వారికి రిటైర్మెంట్ లేకుండా చట్ట సవరణకు ఆమోదం తెలిపింది.

విశాఖ భూముల అక్రమాలపై సిట్ రిపోర్టుకు ఆమోదం తెలిపింది. జులైలో చేపట్టే సంక్షేమ పథకాలకు, ఆర్-5 జోన్ ఇళ్ల నిర్మాణానికి, వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం అమలుకు, ఎస్ఐపీబీ నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. టోఫెల్ పరీక్షల కోసం విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకు ప్రముఖ విద్యా సంస్థ ఈటీఎస్ తో ఒప్పందానికి చేసుకోనుంది. కర్నూలులో క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ కు 247 పోస్టులు మంజూరు చేసింది. వర్సిటీలో శాశ్వత అధ్యాపకుల పదవీ విరమణ వయస్సును 65 ఏళ్లకు పెంచింది.

More Telugu News