Narendra Modi: మోదీ కేబినెట్లో 20 మంది సీనియర్లకు ఉద్వాసన.. ఎందుకంటే..!

  • మోదీ ఫ్రాన్స్ పర్యటనకు ముందే మంత్రి వర్గ విస్తరణకు అవకాశం
  • ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో సీనియర్ల సేవలు!
  • షిండే, అజిత్ పవార్ వర్గానికి కేబినెట్లో చోటు
PM Modi cabinet reshuffle soon

ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటనకు ముందు కేంద్రమంత్రి వర్గ విస్తరణ ఉండవచ్చునని జోరుగా వార్తలు వస్తున్నాయి. ప్రధాని జులై 14 నుండి 16 మధ్య ఫ్రాన్స్ లో పర్యటించనున్నారు. అంతకంటే ముందే బుధవారం మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు చేస్తారనే ప్రచారం సాగుతోంది. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యే లోపు మాత్రం విస్తరణ ఉండవచ్చునని భావిస్తున్నారు.

ప్రధాని మోదీ మొదటి టర్మ్ మూడుసార్లు తన మంత్రివర్గాన్ని విస్తరించారు. ప్రస్తుత రెండో టర్మ్ ఇప్పటికే రెండుసార్లు మార్పులు చేర్పులు చేయగా, ఇది మూడోసారి అవుతుంది. ఈసారి ఏకంగా 20 మంది కొత్తవారికి కేబినెట్లో చోటు దక్కవచ్చునని భావిస్తున్నారు. త్వరలో పలు రాష్ట్రాల్లో కీలక అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఏ వర్గాల్లోను అసంతృప్తి లేకుండా ఈసారి కేబినెట్ విస్తరణ ఉంటుందని అంటున్నారు.

ఈసారి పలువురు సీనియర్లను పక్కన పెట్టి ఎన్నికలు ఉన్నచోట వారిని పార్టీ కోసం ఉపయోగించుకోనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే మోదీ కేబినెట్లో వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యత కల్పించారని, ఈసారి మరికొంతమందికి అవకాశం ఇస్తారని భావిస్తున్నారు. ఇటీవల బీజేపీతో చేతులు కలిపిన పార్టీలకు చోటు దక్కవచ్చునని తెలుస్తోంది. మహారాష్ట్ర నుండి సీఎం ఏక్ నాథ్ షిండే వర్గం, ఎన్సీపీ నేత అజిత్ పవార్ వర్గానికి కేంద్రమంత్రి వర్గంలో చోటు దక్కవచ్చు. అదే సమయంలో గతంలో ఎన్డీయేలో ఉన్న శిరోమణి అకాలీదళ్ వంటి పార్టీలను కూడా దరి చేర్చుకోవాలని బీజేపీ భావిస్తోంది.

More Telugu News