Narendra Modi: బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది నాలుగే పనులు..: ప్రధాని మోదీ సెటైర్లు

  • తనను తిట్టడమే బీఆర్‌‌ఎస్ పనిగా పెట్టుకుందన్న మోదీ
  • అన్ని పదవులు కేసీఆర్ కుటుంబానికేనని విమర్శ
  • తెలంగాణ ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారని మండిపాటు
  • అవినీతి ఆరోపణలు లేని ప్రాజెక్టు ఒక్కటీ లేదని ఆరోపణ
pm modi fires on brs sarkar

బీఆర్ఎస్ లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటివరకు నాలుగు పనులే చేసిందని ఎద్దేవా చేశారు. వరంగల్‌లో బీజేపీ నిర్వహించిన విజయ సంకల్ప సభలో ఆయన మాట్లాడుతూ.. ‘‘మొదటిది.. ఉదయం లేచింది మొదలు మోదీని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు.. మిగతా ఏ పనులు చేయటం లేదు” అంటూ చురకలంటించారు.

‘‘ఇక రెండోది.. కుటుంబ పార్టీని పోషించడం. కుటుంబ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు. అన్ని పదవులు కేసీఆర్ కుటుంబానికే ఉన్నాయి. మూడోది.. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారు. మిగులు నిధులతో ఉన్న తెలంగాణను అప్పుల తెలంగాణ చేశారు” అని మండిపడ్డారు.

‘‘ఇక నాలుగోది.. బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది. ప్రతి పనిలోనూ అవినీతి జరుగుతోంది. అవినీతి ఆరోపణలు లేని ప్రాజెక్టు ఒక్కటి కూడా లేదు” అని తీవ్ర విమర్శలు చేశారు. తన 9 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ చేసింది ఈ నాలుగు పనులే అని ఆరోపించారు

కాంగ్రెస్, బీఆర్ఎస్‌తో జాగ్రత్తగా ఉండాలని మోదీ అన్నారు. ‘‘కాంగ్రెస్ అవినీతిని దేశం మొత్తం చూసింది.. బీఆర్ఎస్ అవినీతిని తెలంగాణ మొత్తం చూసింది. బీఆర్‌‌ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా తెలంగాణకు హానికరమే. ఈ రెండు పార్టీల నుంచి జాగ్రత్తగా ఉండాలి” అని ప్రజలను హెచ్చరించారు.

దేశంలో, తెలంగాణలో కొన్ని పార్టీలు ఎన్నికలకు ముందు అబద్ధపు ప్రమాణాలు చేస్తున్నాయని మోదీ ఆరోపించారు. బీజేపీ అలాంటి ప్రమాణాలు చేయదని, రేషన్ ఇస్తామని చెప్తే ప్రతి ఇంటికీ రేషన్ బియ్యం వచ్చి చేరుతున్నాయని, ఆయుష్మాన్ భారత్ ఇస్తామని చెప్తే దేశంలోని కోట్ల మంది లబ్ధి పొందుతున్నారని చెప్పారు.

More Telugu News