Pawan Kalyan: డీజీపీని కలిసేందుకు జనసేన వీరమహిళల యత్నం... అడ్డుకున్న పోలీసులు

  • పవన్ పై అసభ్య ప్రచారం చేస్తున్నారన్న జనసేన
  • డీజీపీ కార్యాలయానికి బయల్దేరిన వీరమహిళలు
  • ఎన్టీఆర్ భవన్ వద్ద అడ్డుకున్న పోలీసులు
  • రోడ్డుపై బైఠాయించిన వీరమహిళలు
Veeramahila workers were halted by police

జనసేనాని పవన్ కల్యాణ్ పై, ఆయన కుటుంబ సభ్యులపై అసభ్య ప్రచారం చేస్తున్నారంటూ జనసేన వీరమహిళలు నేడు డీజీపీని కలిసి ఫిర్యాదు చేసే ప్రయత్నం చేశారు. అయితే, డీజీపీ కార్యాలయానికి బయల్దేరిన జనసేన వీరమహిళలను పోలీసులు అడ్డుకున్నారు. 

మంగళగిరి వద్ద ఎన్టీఆర్ భవన్ సమీపంలో బారికేడ్లు, వాహనాలు అడ్డుగా పెట్టిన పోలీసులు... జనసేన కార్యకర్తలను నిలువరించారు. దాంతో జనసేన వీరమహిళలు అక్కడే రోడ్డుపై బైఠాయించి సీఎం జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైసీపీ అంతం... జనసేన పంతం అంటూ నినాదాలతో హోరెత్తించారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదంటూ ఎలుగెత్తారు. పవన్ పై అసభ్య ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. 

ఈ సందర్భంగా వీరమహిళలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం నెలకొంది. డీజీపీని కలిసేందుకు అనుమతించాలంటూ వీరమహిళలు డిమాండ్ చేశారు. అయితే, ఒక వాహనంలో పరిమిత సంఖ్యలో మాత్రమే డీజీపీ కార్యాలయానికి వెళ్లాలని పోలీసులు సూచించారు.

More Telugu News