రూ. 2.5 లక్షల విలువైన టమాటాల చోరీ.. బోరుమన్న మహిళా రైతు
- కర్ణాటకలో ఘటన
- రెండెకరాల్లో పండించిన టమాటాలను కోసుకెళ్లిన దొంగలు
- వెళ్తూ వెళ్తూ మిగతా పంట ధ్వంసం
- కొండెక్కిన మిగతా కూరగాయల ధరలు
కర్ణాటకలో ఓ రైతు రెండెకరాల్లో పండించిన టమాటాలను దొంగలు ఎంచక్కా కోసుకెళ్లిపోయారు. వాటి విలువ రూ. 2.5 లక్షల పైమాటేనని బాధిత మహిళా రైతు ధరణి వాపోయింది. పంటను కోసి బెంగళూరు మార్కెట్కు తరలించాలని అనుకున్నామని, అంతలోనే దొంగలు మొత్తం దోచుకుపోయారని పేర్కొంది. ప్రస్తుతం బెంగళూరులో కిలో టమాటా రూ. 120కిపైనే పలుకుతోంది. టమాటాలను చోరీ చేసిన దొంగలు మిగతా పంటను కూడా ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. టమాటాల చోరీపై హలెబీడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
మిగతా కూరగాయల ధరలు కూడా ఆకాశంలోనే
దేశవ్యాప్తంగా టమాటా ధరలు చూసుకుంటే ఢిల్లీలో రూ. 129, ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్లో రూ. 150 పలుకుతున్నాయి. మిగతా కూరగాయల ధరలు కూడా భారీగా పెరిగాయి. మే నెలలో రూ. 40 ఉన్న కాలీఫ్లవర్ ధర ఇప్పుడు రూ. 60కి చేరుకుంది. రూ. 30-40 ఉన్న క్యాబేజీ కూడా రూ. 60కి చేరుకోగా, ఉల్లి, బంగాళదుంపల ధరలు రూ. 20 నుంచి రూ. 30కి చేరుకున్నాయి. బీన్స్ ధర కూడా టమాటాతో పోటీపడుతూ రూ. 160కి పెరిగింది.