Gidugu Rudra Raju: ఈ మూడు పార్టీలు బీజేపీకి దాసోహం అయ్యాయి: ఏపీ కాంగ్రెస్ చీఫ్ గిడుగు రుద్రరాజు

  • టీడీపీ, వైసీపీ, జనసేనలు బీజేపీ బీ టీమ్ లు అన్న గిడుగు
  • బీజేపీ అంటే బాబు, జగన్, పవన్
  • విశాఖ స్టీల్ ప్రైవేటీకరణను వీరు ముగ్గురు అడ్డుకోవడం లేదని విమర్శ
TDP YSRCP Janasena are BJP B teams says Gidugu Rudra Raju

ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో తెలంగాణలో పూర్తి స్థాయిలో పుంజుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఇదే సమయంలో వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని... ఆమెకు ఏపీ బాధ్యతలను అప్పగించే అవకాశం ఉందనే వార్తలు కూడా వస్తున్నారు. షర్మిల కాంగ్రెస్ లో చేరబోతోందనే సమాచారం తనకు ఉందని కేవీపీ రామచంద్రరావు కూడా చెప్పడం గమనార్హం. 

మరోవైపు ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టివిక్రమార్క ఆంధ్రరత్న భవన్ లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వీరు మీడియాతో మాట్లాడుతూ బీజేపీపై విమర్శలు గుప్పించారు. 

బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని ఈ సందర్భంగా గిడుగు రుద్రరాజు విమర్శించారు. ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం కార్యాచరణను మొదలు పెట్టినా... ఏపీలో అధికారంలో ఉన్న జగన్, ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు, పవన్ కల్యాణ్ వ్యతిరేకించడం లేదని విమర్శించారు. టీడీపీ, వైసీపీ, జనసేనలు బీజేపీకి బీ టీమ్ పార్టీలని దుయ్యబట్టారు. ఈ మూడు పార్టీలు బీజేపీకి దాసోహం అంటున్నాయని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే విశాఖ స్టీల్ ప్రైవేటీకరణను ఆపేస్తామని తెలిపారు.

More Telugu News