BJP: గంగూలీకి బీజేపీ రాజ్యసభ ఆఫర్... దాదా ఒప్పుకుంటాడా?

  • బెంగాల్ లో ఖాళీ అయిన స్థానంలో పోటీకి దింపాలని భావిస్తున్న పార్టీ
  • ఇంకా సమ్మతి తెలుపని దిగ్గజ క్రికెటర్
  • పరిశీలనలో మాజీ ఎంపీ, సినీ నటుడు మిథున్ చక్రవర్తి పేరు
BJP considering Sourav Ganguly Mithun for lone Rajya Sabha seat in West Bengal

భారత దిగ్గజ క్రికెటర్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి రాజ్యసభ సభ్యత్వం లభించే అవకాశం కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్ నుంచి గంగూలీని రాజ్యసభ బరిలో దింపాలని బీజేపీ భావిస్తోంది. బెంగాల్ లో ఖాళీ అవుతున్న ఏకైక రాజ్యసభ స్థానానికి బీజేపీ పోటీ చేయనుంది. అభ్యర్థులుగా గంగూలీతో పాటు బెంగాల్ మెగాస్టార్ మిథున్ చక్రవర్తి పేర్లు పరిశీలిస్తోంది. పార్టీ రాష్ట్ర నాయకత్వం సూచించిన మరికొందరి పేర్లను కూడా పార్టీ పెద్దలు పరిశీలిస్తున్నారు. రాష్ట్ర నాయకులు రెండు వేర్వేరు జాబితాలను ఢిల్లీకి పంపారు. ఒక జాబితాను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ సమర్పించగా, మరొకటి ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి అందించారు. సువెందు అధికారి జాబితాలో నాలుగు పేర్లు ఉన్నాయి. 

గంగూలీ, మాజీ రాజ్యసభ సభ్యుడైన మిథున్ చక్రవర్తి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు అనిర్బన్ గంగూలీ, గ్రేటర్ కూచ్‌బెహార్ పీపుల్స్ అసోసియేషన్ చైర్మన్ అనంత్ మహారాజ్ పేర్లను ఆయన ప్రతిపాదించారు. మరోవైపు, మజుందార్ జాబితాలో రాజ్యసభ మాజీ సభ్యులు రూపా గంగూలీ, స్వపన్ దాస్‌గుప్తా, బీజేపీ బెంగాల్ అధికార ప్రతినిధి సమిక్ భట్టాచార్య, రైల్వే శాఖ మాజీ మంత్రి దినేష్ త్రివేది, అనంత్ మహరాజ్ ఉన్నారు. బీసీసీఐ అధ్యక్షుడిగా పని చేసిన సమయంలో బోర్డు కార్యదర్శి, హోంమంత్రి కుమారుడైన జై షా ద్వారా బీజేపీ పెద్దలతో గంగూలీకి సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో సౌరవ్ గంగూలీకి నామినేషన్‌ను పార్టీ పెద్దలు ప్రతిపాదించారు. అయితే, దీనికి గంగూలీ నుంచి ఇంకా సమ్మతి రాలేదు. బీజేపీ ఆఫర్ కు దాదా ఒప్పుకుంటాడో లేదో చూడాలి.

More Telugu News