gutta sukhender reddy: నేను పోటీ చేయను.. నా కొడుక్కి టిక్కెట్ ఇవ్వకపోయినా పార్టీ కోసం పనిచేస్తాం: గుత్తా సుఖేందర్ రెడ్డి

  • వారసత్వం ఎంట్రీ కార్డు మాత్రమే.. ప్రజల మద్దతు పొందితేనే భవిష్యత్తు అని వ్యాఖ్య
  • ఎమ్మెల్సీగా తనకు మరో నాలుగేళ్ల సమయం ఉందన్న గుత్తా
  • కాంగ్రెస్ లేని కూటమి కావాలనే పాట్నా సమావేశానికి వెళ్లలేదని వెల్లడి
Gutta Sukehnder Reddy will not contest next election

వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. పార్టీ అధిష్ఠానం అవకాశమిస్తే తన తనయుడు అమిత్ పోటీలో ఉంటారని, ఒకవేళ టిక్కెట్ ఇవ్వకపోయినా పార్టీ కోసం పని చేస్తారన్నారు. ఎమ్మెల్సీగా తనకు మరో నాలుగేళ్ల పదవీ కాలం ఉందని, ఈ నేపథ్యంలో పోటీ చేయనని చెప్పారు. ఆయన శాసన మండలిలోని తన ఛాంబర్ లో మీడియాతో మాట్లాడుతూ... రాజకీయాల్లో వారసత్వం కేవలం ఎంట్రీ కార్డు మాత్రమే అని, వ్యక్తిగతంగా ప్రజల మద్దతు పొందితేనే భవిష్యత్తు ఉంటుందన్నారు.

మూడోసారి తెలంగాణలో బీఆర్ఎస్ గెలుస్తుందని, ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొంతమంది కాంగ్రెస్ నేతలు తమ పార్టీలో చేరుతారన్నారు. ఈ జిల్లాలో అన్ని సీట్లు తమ పార్టీయే గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన కొంతమంది నేతలు కాంగ్రెస్ లో చేరుతామంటూ ఆ పార్టీని కాస్త ఎక్కువగా ఊహించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఖమ్మంలో గత ఎన్నికల కంటే తమకు ఎక్కువ సీట్లు వస్తాయన్నారు. కాంగ్రెస్ లేని కూటమి తమ విధానమని కేసీఆర్ ఇప్పటికే చెప్పారని, అందుకే పాట్నా సమావేశానికి వెళ్లడం లేదన్నారు. తెలుగు రాష్ట్రాలకు విభజన హామీలు అమలు చేయడంలో కేంద్రం విఫలమైందన్నారు.

More Telugu News