thulasi reddy: ప్రభుత్వం తప్పులను మీడియా వేలెత్తి చూపితే మార్గదర్శిని వేధిస్తారా?: కాంగ్రెస్ నేత

  • మార్గదర్శిపై జగన్ ప్రభుత్వం అత్యుత్సాహం, కక్ష సాధింపు అని వ్యాఖ్య
  • మార్గదర్శిపై వారికి లేని సమస్య మీకెందుకని ప్రశ్న
  • జగన్ రాష్ట్రానికి తీరని నష్టం చేస్తున్నారని ఆరోపణ
Congress leader Tulasi Reddy fires at YSRCP government

మార్గదర్శి సంస్థపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, ఇది దారుణమని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి బుధవారం విమర్శలు గుప్పించారు. ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.... ప్రభుత్వం చేసే తప్పులను మీడియాలో ఎత్తిచూపితే మార్గదర్శిని వేధించడం జగన్ ప్రభుత్వ అరాచకానికి నిదర్శనం అన్నారు. మార్గదర్శి వివిధ రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోందని, ఎక్కడా లేనివిధంగా ఆంధ్రప్రదేశ్ లోనే సమస్య ఎందుకు వచ్చిందో చెప్పాలన్నారు.

మార్గదర్శిపై ఒక్క ఫిర్యాదు లేదని, అయినా ప్రభుత్వానికి ఇంత అత్యుత్సాహం ఎందుకో చెప్పాలని నిలదీశారు. ఆవు, దూడ బాగా ఉన్నప్పటికీ, మధ్యలో గుంజకు వచ్చింది గురకరోగమని ఓ సామెత ఉందని, అలా ఇచ్చేవాళ్లు, తీసుకునేవాళ్లకు లేని సమస్య ప్రభుత్వానికి ఎందుకో చెప్పాలన్నారు. జగన్ ప్రభుత్వం తీరు వల్ల ఎన్నో పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయన్నారు. ఈ ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు పెంచవలసింది పోయి వివిధ సంస్థలను వేధిస్తూ.. వాటిని రాష్ట్రం నుండి వెళ్లగొట్టి ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతున్నాడన్నారు. రాష్ట్రానికి జగన్ తీరని ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. సీఐడీ అధికారులు కూడా రాజకీయ నాయకుల మాదిరి మాట్లాడటం సరికాదన్నారు.

More Telugu News