Bheeshma Sujatha: ఎన్టీఆర్ ని కలుసుకోవడం అంత తేలికైన పనేం కాదు: 'భీష్మ' సుజాత

  • 'భీష్మ' సినిమాతో సుజాతకి గుర్తింపు 
  • అప్పటికి ఎన్టీఆర్ గురించి అంతగా తెలియదని వ్యాఖ్య 
  • ఆయన ఎక్కువగా మాట్లాడేవారు కాదని వెల్లడి 
  • అప్పట్లో ఆయనను కలుసుకోవడం కూడా కష్టమేనని వివరణ 
Bheeshma Sujatha Interview

ఎన్టీ రామారావుతో కలిసి 'భీష్మ' సినిమాలో సుజాత నటించారు. అప్పటి నుంచి ఆమెను 'భీష్మ' సుజాత అనేవారు. తాజాగా ఆమె 'తెలుగు వన్' కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఎన్టీఆర్ గురించి ప్రస్తావించారు. "ఎన్టీఆర్ తో 'భీష్మ' సినిమా చేసిన తరువాత, ఆయనను ఒకసారి కలిసి రమ్మని మా ఇంట్లో వాళ్లు చెప్పేవారు. లేదంటే ఆయన మరిచిపోతారని అనేవారు. అందువలన ఒకసారి ఆయనను కలవడానికి ఇంటికి వెళ్లాను. 

ఎన్టీఆర్ ఇంటి దగ్గరికి వెళ్లేసరికి ఆయనను చూడటానికి బస్సుల్లో వచ్చిన అభిమానులతో ఆ ప్రాంతమంతా కిటకిటలాడుతోంది. ఇక ఎలాగో అలా వాళ్లను తప్పించుకుంటూ ఇంట్లోకి వెళితే.. రన్నింగులో ఉన్న సినిమాల నిర్మాతలు .. కొత్తగా సినిమాలు చేయాలనుకుంటున్న నిర్మాతలతో లోపలంతా హడావిడిగా ఉంది. అదంతా చూసి ఆయనను కలుసుకోవడం కష్టమేనని అనుకున్నాను. 

ఆ తరువాత ఆయన కంట్లో పడ్డాను. ఆత్మీయంగా పలకరించి పంపించారు. షూటింగు సమయంలో డైలాగ్స్ తప్పుగా చెబుతానేమోనని కొంచెం టెన్షన్ పడేదానిని. రామారావుగారితో మొదటి సినిమా చేసేటప్పటికీ ఆయన ఎంత గొప్ప అనేది నాకు అంతగా తెలియదు. ఆ తరువాత తెలుస్తూ వచ్చింది. ముందే తెలిసి ఉంటే నోట్లో నుంచి మాట కూడా వచ్చేది కాదేమో" అంటూ నవ్వేశారు.

More Telugu News