Revanth Reddy: జూపల్లి, పొంగులేటిని కలవనున్న రేవంత్ రెడ్డి

  • రేపు మధ్యాహ్నం వారితో సమావేశం కానున్న కాంగ్రెస్ అధ్యక్షుడు
  • వారిద్దరినీ పార్టీలోకి ఆహ్వానించనున్నట్లుగా సమాచారం
  • ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటి సన్నిహిత ఎమ్మెల్యేలతోను రేవంత్ భేటీ!
Revanth Reddy to meet Ponguleti and Jupally

బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెన్షన్ కు గురైన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులను కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బుధవారం కలవనున్నారు. రేపు మధ్యాహ్నం వారితో సమావేశమై, పార్టీలోకి ఆహ్వానించనున్నట్లుగా తెలుస్తోంది. ఇదే సమయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటి సన్నిహిత ఎమ్మెల్యేలతోను రేవంత్ భేటీ కానున్నారు. ఈ విషయమై ఇప్పటికే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన అనుచరులకు సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. 

కాగా, పొంగులేటి, జూపల్లిలను బీఆర్ఎస్ బహిష్కరించిన అనంతరం వారు బీజేపీలోకి వెళ్తారని.. కాదు కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ఊహాగానాలు వచ్చాయి. ప్రారంభంలో బీజేపీ వైపు మొగ్గు చూపినట్లుగా కనిపించింది. వారితో బీజేపీ నేత ఈటల రాజేందర్ కూడా చర్చలు జరిపారు. అయితే ఖమ్మం జిల్లాలో బీజేపీకి అంతగా పట్టు లేకపోవడంతో పొంగులేటి కాంగ్రెస్ దిశగా చూస్తున్నట్లుగా కనిపిస్తోంది. కొంత కాలం క్రితం ఈటల చేసిన వ్యాఖ్యలు కూడా దీనిని ధ్రువీకరిస్తున్నాయి. ఇక జూపల్లి గతంలో కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం ఉన్నారు. పొంగులేటితో పాటు జూపల్లి కాంగ్రెస్ లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రేవంత్ వారితో భేటీ కానున్నారని సమాచారం.

More Telugu News