train: ఏపీలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. పలు రైళ్ల రద్దు

  • అనకాపల్లిలో ఈ తెల్లవారుజామున ఘటన
  • తాడి–అనకాపల్లి రైల్వే స్టేషన్ల మధ్య దెబ్బతిన్న ట్రాక్
  • పునరుద్ధరణ పనులు చేపట్టిన రైల్వే సిబ్బంది
Goods train derailed at anakapalli

ఆంధ్రప్రదేశ్ లో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. అనకాపల్లి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. తాడి-అనకాపల్లి మార్గంలో బొగ్గు లోడ్‌తో ప్రయాణిస్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ తెల్లవారుజాము మూడున్నర గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘనటతో ట్రాక్ పూర్తిగా దెబ్బతింది. దీంతో విశాఖపట్నం నుంచి విజయవాడ వైపు వెళ్లే పలు పాసింజర్, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు రద్దయ్యాయి. పలు రైళ్లకు అంతరాయం కలిగింది. 

జన్మభూమి ఎక్స్‌ప్రెస్, విశాఖ నుంచి గుంటూరు వెళ్లే సింహాద్రి ఎక్స్‌ప్రెస్ తో పాటు రత్నాచల్– ఉదయ్ ఎక్స్‌ప్రెస్‌లను కూడా ఈ రోజు రద్దు చేశారు. గుంటూరు నుంచి విశాఖపట్నానికి వెళ్లే సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ జూన్ 15న కూడా రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. విశాఖ-సికింద్రాబాద్ మధ్య నడిచే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ 3 గంటలు ఆలస్యంగా నడుస్తోందని పేర్కొంది. మరోవైపు రైల్వే అధికారులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ట్రాక్ పునరుద్ధరణ పనులను శరవేగంగా చేపడుతున్నారు.

More Telugu News