Anam Ramanarayana Reddy: టీడీపీ సభ్యత్వంపై తొందరేం లేదని చంద్రబాబు చెప్పారు: ఆనం రామనారాయణ రెడ్డి

  • టీడీపీ సభ్యత్వం తీసుకోవడానికి మరికొంత సమయం పడుతుందన్న ఆనం
  • లోకేశ్ చేపట్టిన పాదయాత్రపై దృష్టి పెట్టమని చంద్రబాబు కోరారని వెల్లడి
  • పార్టీలో చేరడం, సభ్యత్వం తీసుకోవడం మరోసారి చూసుకోవచ్చని సూచించారని వ్యాఖ్య
mla anam ramanarayana reddy clarifies on tdp membership

టీడీపీ సభ్యత్వం తీసుకోవడానికి మరికొంత సమయం పడుతుందని నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర మీద దృష్టి పెట్టమని చంద్రబాబు కోరారని చెప్పారు. పాదయాత్ర మంగళవారం సాయంత్రం నెల్లూరు జిల్లాలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. జిల్లాలో లోకేశ్‌ పాదయాత్ర పర్యవేక్షణ బాధ్యతలను తనకు చంద్రబాబు అప్పగించినట్టు తెలిపారు.


‘‘పార్టీలో చేరేందుకు రెండు నెలల సమయం పడుతుందని చంద్రబాబును కలిసినప్పుడే చెప్పాను. సన్నిహితులను కలిసి, అందరినీ ఒప్పించి.. మేమంతా టీడీపీ సభ్యత్వం తీసుకుంటామని చెప్పాను. జులై నెలాఖరు దాకా కొంత సమయం ఇవ్వాలని కోరాను. కానీ ఇంతలోనే యువ గళం పాదయాత్ర నెల్లూరు జిల్లాలోకి అడుగుపెడుతోంది. గతంలో నేను ప్రతినిధిగా ఉన్న ఆత్మకూరు నియోజకవర్గంలోకి లోకేశ్ వస్తున్నారు. దీంతో యువగళం పాదయాత్ర మీద దృష్టిపెట్టమని చంద్రబాబు కోరారు’’ ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. 

‘‘పార్టీలో చేరడం, సభ్యత్వం తీసుకోవడమనేది మరోసారి చూసుకోవచ్చని చంద్రబాబు చెప్పారు. తొందరేం లేదని అన్నారు. లోకేశ్ పాదయాత్రను విజయవంతం చేసే బాధ్యతను అప్పజెప్తున్నామని అన్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ కార్యాలయానికి రావాలని నేతలు కోరారు. పాదయాత్రపై సమీక్షించాలని కోరారు. అందుకే వెళ్లాను’’ అని ఆయన వివరించారు. లోకేశ్ పాదయాత్రను విజయవంతం చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు.

More Telugu News