తిరుపతి అందాల వీక్షణకు హెలికాప్టర్ రైడ్

Helicopter Ride for Tirupati aerial view
  • హెలికాప్టర్ రైడ్ ఏర్పాటు చేసిన ఏరో డాన్ సంస్థ
  • తిరుపతి నుంచి చంద్రగిరి కోట వరకు రైడ్
  • ఒకరికి చార్జి రూ.6 వేలు
  • ఒక్కో రైడ్ సమయం 8 నిమిషాలు
సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలకు నిత్యం వేలమంది భక్తులు వస్తుంటారు. వారిలో కొందరు తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం తిరుపతి చుట్టుపక్కల ఉన్న ఆలయాలను, వివిధ పర్యాటక ప్రదేశాలను కూడా దర్శిస్తుంటారు. ఇలా తిరుమల వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకుని ఏరో డాన్ అనే సంస్థ హెలికాప్టర్ రైడ్ ఏర్పాటు చేసింది. 

ఆసక్తి ఉన్నవారు ఈ హెలికాప్టర్ లో తిరుపతి, పరిసర ప్రాంతాల అందాలను గగనతలం నుంచి వీక్షించవచ్చు. అందుకోసం ఒక్కొక్కరు రూ.6 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ జాయ్ రైడ్ 8 నిమిషాలు ఉంటుంది. ఈ రైడ్ కోసం 6 సీట్ల సామర్థ్యం ఉన్న హెలికాప్టర్ ను వినియోగించనున్నారు. పైలెట్ తో పాటు మరో ఐదుగురు పర్యాటకులు దీంట్లో ప్రయాణించవచ్చు. 

రైడ్ లో భాగంగా తిరుపతి నుంచి చంద్రగిరి కోట వరకు తీసుకెళ్లి, తిరిగి తిరుపతి తీసుకువస్తారు. గంటకు 6 ట్రిప్పులు వేసేలా ఏరో డాన్ సంస్థ ప్రణాళికలు రూపొందించింది. శ్రీవారి భక్తులే కాకుండా, తిరుపతి వాసులు కూడా ఈ హెలికాప్టర్ రైడ్ ను ఆస్వాదించవచ్చని ఏరో డాన్ సంస్థ చెబుతోంది. 

కాగా, ఈ నెల 16 నుంచి 19 వరకు ట్రయల్స్ నిర్వహించనున్నారు. టికెట్ బుకింగులు శనివారం నుంచి అందుబాటులోకి రానున్నాయి.
Advertisement
Helicopter Ride
Tirupati
Chandragiri Fort
Aerodon

More Telugu News