Tamilisai Soundararajan: తెలంగాణ అంటే హైదరాబాద్ ఒక్కటే కాదు.. అందరూ అభివృద్ధి చెందాలి: తమిళిసై

  • హైదరాబాద్‌ సహజసిద్ధ అనుకూలతతో వేగంగా అభివృద్ధి చెందుతోందన్న తమిళిసై
  • ‘జై తెలంగాణ’ అనేది నినాదం మాత్రమే కాదని, ఆత్మగౌరవ చిహ్నమని వ్యాఖ్య
  • సరికొత్త రాష్ట్రాన్ని ఆవిష్కరించుకుందామని ప్రజలకు పిలుపు
telangana governor tamilisai soundararajan speech at rajbhavan

‘జై తెలంగాణ’ అనేది కేవలం ఒక నినాదం కాదని, ఒక ఆత్మగౌరవ చిహ్నమని తెలంగాణ గవర్నర్ తమిళిసై అన్నారు. అనేక రంగాల్లో తెలంగాణ ప్రత్యేకత చాటుకుంటోందని చెప్పారు. రాజ్‌భవన్‌లో నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో గవర్నర్‌ మాట్లాడారు. తెలంగాణ వీరులకు జోహార్లు తెలిపిన గవర్నర్.. ఉద్యమకారులకు సన్మానం చేశారు. 

హైదరాబాద్‌ సహజసిద్ధ అనుకూలతతో వేగంగా అభివృద్ధి చెందుతోందని తమిళిసై అన్నారు. రాష్ట్రం అంటే హైదరాబాద్ ఒక్కటే కాదన్నారు. మారుమూల పల్లెలకు కూడా అభివృద్ధి ఫలాలు అందాలని వ్యాఖ్యానించారు. ‘‘నీళ్లు, నిధులు, నియామకాల ఆకాంక్షలతోనే తెలంగాణ ఉద్యమం వచ్చింది. కొందరు మాత్రమే కాదు.. అందరూ అభివృద్ధి చెందాలి. జై తెలంగాణ అంటే కేవలం ఒక నినాదం మాత్రమే కాదు. జై తెలంగాణ అనేది ఆత్మగౌరవానికి చిహ్నం’’ అని చెప్పారు. 

తన జీవితంలో ప్రతి నిమిషం ప్రజల కోసమేనని తమిళిసై అన్నారు. కేంద్ర సహకారంతో రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని తెలిపారు. రాష్ట్రానికి జాతీయ స్థాయిలో ఖ్యాతి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి ఎన్‌ఆర్‌ఐలు చేయూత అందివ్వాలని కోరారు. సరికొత్త రాష్ట్రాన్ని ఆవిష్కరించుకుందామని, తెలంగాణను దేశంలోనే నంబర్‌ వన్ గా తీర్చిదిద్దుకుందామని ప్రజలకు పిలుపునిచ్చారు.

More Telugu News