Natti Kumar: ఏపీ ఫైబర్ నెట్ లో సినిమా విడుదలైన తొలి రోజే ప్రదర్శన.. ఏపీ ప్రభుత్వ నిర్ణయం సరికాదన్న నట్టి కుమార్

  • ఈ విధానం ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ వ్యవస్థను నాశనం చేస్తుందన్న నట్టికుమార్
  • సినీ పరిశ్రమను సంప్రదించకుండా ఎలా నిర్ణయం తీసుకుంటారని ప్రశ్న
  • పోసాని కృష్ణ మురళిపై కూడా విమర్శలు
CM Jagan decision is not correct says producer Natti Kumar

కొత్త సినిమాలను విడుదలైన తొలి రోజే ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఫైబర్ నెట్ లో ప్రదర్శించాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం రేపు విశాఖపట్నంలో జరగనుంది. ఈ నేపథ్యంలో నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీ నట్టి కుమార్ మాట్లాడుతూ ఫైబర్ నెట్ లో కొత్త సినిమాలు ప్రదర్శించడం కరెక్ట్ కాదని చెప్పారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సినిమా విడుదల రోజునే ఫైబర్ నెట్ లో చూపిస్తామని ప్రభుత్వం అంటోందని.. ఇది ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ వ్యవస్థను నాశనం చేస్తుందని అన్నారు. 

సినీ పరిశ్రమను, నిర్మాతల మండలిని, ఫిలిం ఛాంబర్ ను సంప్రదించకుండానే, జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయకుండానే ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటారని నట్టి కుమార్ ప్రశ్నించారు. తమ సినిమా ఇవ్వడానికి నిర్మాతలు ముందుకు రానప్పుడు ఈ విధానం ఎలా సక్సెస్ అవుతుందని అన్నారు. డిస్ట్రిబ్యూటర్స్ వ్యవస్థను నాశనం చేసే ఈ విధానాన్ని ఎక్కువ మంది నిర్మాతలు వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. ఏపీ చలనచిత్ర అభివృద్ధి సంస్థ ఛైర్మన్ పోసాని కృష్ణ మురళి సినీ రంగానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ... అందరి అభిప్రాయాలను తీసుకోకుండా ఈ విధానాన్ని ఆచరణలోకి తీసుకురావడం కరెక్ట్ కాదని అన్నారు.

More Telugu News