Kodali Nani: రాజకీయాల కోసం కాపులను ఎన్నటికీ విమర్శించను: కొడాలి నాని

  • వైసీపీ పాలనకు నాలుగేళ్లు
  • గుడివాడలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసిన కొడాలి నాని
  • తన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం
  • తన 20 ఏళ్ల రాజకీయ జీవిత విజయాల్లో సగభాగం కాపులదేనని వివరణ
Kodali Nani clarifies on his recent comments

వైసీపీ ప్రభుత్వ పాలన మొదలై నాలుగేళ్లయిన సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని గుడివాడ నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి నివాళులు అర్పించి, కేక్ కట్ చేశారు. అనంతరం కొడాలి నాని మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేత వంగవీటి రాధా తన సొంత తమ్ముడిలాంటివాడని, గుడివాడ నుంచి పోటీ చేయడని స్పష్టం చేశారు. 

కాపులపై తాను వ్యాఖ్యలు చేసినట్టు దుమారం రేగుతుండడంపైనా కొడాలి నాని స్పందించారు. రాజకీయాల కోసం కాపులను ఎప్పటికీ విమర్శించబోనని, 20 ఏళ్ల రాజకీయ జీవితంలో తన విజయాల్లో కాపులదే సగభాగం అని వివరణ ఇచ్చారు. వంగవీటి రంగాకు వ్యతిరేకంగా జరిగిన ఏ కార్యక్రమంలోనూ తాను పాల్గొనలేదని వెల్లడించారు.

రాజమండ్రి మహానాడు వేదికపై ఎన్టీఆర్ ఫొటో పక్కన కొందరి ఫొటోలు పెట్టడంపైనే తాను మాట్లాడానని, టీడీపీ వాళ్లు ప్రచారం చేస్తున్న అబద్ధాన్ని కాపు సోదరులెవరూ నమ్మలేదని కొడాలి నాని తెలిపారు. తాను మాట్లాడిన మాటలను టీడీపీ నేతలు ఎడిట్ చేసి వదిలారని ఆరోపించారు.

More Telugu News