World Test Championship: ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్.. ప్రైజ్ మనీ ఎంతో చెప్పిన ఐసీసీ!

  • మొత్తం 9 జ‌ట్లకు రూ.31.4 కోట్లు అందుతాయన్న ఐసీసీ
  • ఫైనల్ లో గెలిచిన జట్టుకు రూ.13.22 కోట్లు, ర‌న్న‌ర‌ప్ కు 6.61 కోట్లు అందుతాయని వెల్లడి
  • గత డబ్ల్యూటీసీ ప్రైజ్ మనీనే ఈ సారి కూడా ఇస్తున్నామని ప్రకటన 
  • జూన్ 7 నుంచి లండన్ లో టీమిండియా, ఆసీస్ మధ్య ఫైనల్
icc announced prize money for world test championship 2021 23 cycle

జూన్ లో ప్రపంచ టెస్ట్ చాంపియ‌న్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ జరగనుంది. టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్ 2021-23 ప్రైజ్‌మ‌నీని అంత‌ర్జాతీయ క్రికెట్ మండ‌లి (ఐసీసీ) ప్ర‌క‌టించింది. మొత్తం 9 జ‌ట్లు రూ.31.4 కోట్ల‌ను పంచుకోనున్నట్లు తెలిపింది. ఫైనల్ లో గెలిచిన జట్టు రూ.13.22 కోట్ల ప్రైజ్‌మ‌నీని ద‌క్క‌ించుకుంటుందని వెల్లడించింది.

నిజానికి తొలి టెస్ట్ చాంపియ‌న్‌షిప్‌, ఈసారి నిర్వ‌హిస్తున్న టోర్నీ ప్రైజ్‌మ‌నీలో ఎలాంటి మార్పు లేద‌ని ఐసీసీ త‌న ప్ర‌క‌ట‌న‌లో చెప్పింది. 2019-21లో జ‌రిగిన టెస్ట్ చాంపియ‌న్‌షిప్‌కు ఇచ్చినట్లే ఈ సారి కూడా ఇస్తున్నట్లు తెలిపింది. 2021లో జ‌రిగిన ఫైన‌ల్లో ఇండియాపై నెగ్గిన కివీస్ జ‌ట్టుకు 13 కోట్ల ప్రైజ్‌మ‌నీ ఇచ్చారు.

ఈసారి ఆస్ట్రేలియా, టీమిండియా మ‌ధ్య లండ‌న్‌లో డబ్ల్యూటీసీ ఫైన‌ల్ జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. జూన్ 7వ తేదీన మ్యాచ్ ప్రారంభం కానుంది. గెలిచిన జ‌ట్టుకు 13.22 కోట్లు, ర‌న్న‌ర‌ప్ కు 6.61 కోట్లు దక్కనున్నాయి. ఇక డబ్ల్యూటీసీ ర్యాంకింగ్స్ లో మూడో స్థానంలో ఉన్న సౌతాఫ్రికాకు 3.72 కోట్లు ద‌క్క‌నున్నాయి. నాలుగో స్థానంలో ఉన్న ఇంగ్లండ్‌కు 2.9 కోట్లు, ఐదో స్థానంలో ఉన్న శ్రీలంక‌కు 1.65 కోట్లు, న్యూజిలాండ్‌(6), పాకిస్థాన్‌(7), వెస్టిండీస్‌(8), బంగ్లాదేశ్‌(9) జ‌ట్ల‌కు రూ.82 ల‌క్ష‌ల చొప్పున అందనున్నాయి.

More Telugu News