Delhi court: పాస్ పోర్ట్ దరఖాస్తు ​విషయంలో రాహుల్​ గాంధీకి కోర్టులో ఊరట

  • ఎంపీగా అనర్హత వేటు పడటంతో దౌత్య పాస్ పోర్ట్ సరెండర్ చేసిన రాహుల్
  • సాధారణ పాస్ పోర్ట్ కోసం దరఖాస్తు చేసిన కాంగ్రెస్ అగ్రనేత
  • ఆయనకు ఎన్ఓసీ మంజూరు చేయవద్దంటూ సుబ్రహ్మణ్యస్వామి పిటిషన్
Delhi court partly allows passport application by Rahul Gandhi grants NOC for 3 years

సాధారణ పాస్‌ పోర్ట్ కోసం కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ దరఖాస్తును ఢిల్లీ కోర్టు శుక్రవారం పాక్షికంగా అనుమతించింది. మూడేళ్లపాటు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (ఎన్‌ఓసి) మంజూరు చేసింది. ఎంపీగా అనర్హత వేటు పడిన తర్వాత రాహుల్ గాంధీ తన దౌత్య పాస్‌పోర్టును సరెండర్ చేశారు. ఆ తర్వాత సాధారణ పాస్‌ పోర్ట్ కోసం ఎన్‌ఓసి కోరారు. అయితే, నేషనల్ హెరాల్డ్ కేసులో గాంధీ నిందితుడిగా ఉండటంతో ఆయనకు పాస్ పోర్ట్ మంజూరు చేయవద్దంటూ బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి డిమాండ్ చేశారు. రాహుల్ దరఖాస్తును వ్యతిరేకిస్తూ ఆయన కోర్టును ఆశ్రయించారు. 

దీనిపై శుక్రవారం విచారణ చేపట్టిన ఢిల్లీ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ వైభవ్ మెహతా వాదనలు విన్న సమయంలో స్వామి సదరు దరఖాస్తును వ్యతిరేకించారు. రాహుల్ కు పాస్‌పోర్ట్‌ను ఒక సంవత్సరం పాటు మాత్రమే జారీ చేయాలని, ప్రతి సంవత్సరం పునరుద్ధరించాలని అన్నారు.  ఇది ప్రత్యేకమైన కేసు అనీ, పదేళ్ల కాలానికి పాస్ పోర్ట్ జారీ చేయకూడదని అన్నారు. అలా చేయడం తప్పుగా అవుతుందన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి మూడేళ్ల కాలానికి మాత్రమే ఎన్వోసీని మంజూరు చేశారు.   

More Telugu News