Kesineni Nani: వైసీపీ ఎమ్మెల్యేను ప్రశంసించడంపై కేశినేని నాని వివరణ

  • మొండితోక జగన్మోహన్ ను ప్రశంసించిన కేశినేని నాని
  • మంచి చేసే వాళ్లను తాను ప్రశంసిస్తానన్న నాని
  • ఎంపీ టికెట్ ఇవ్వకపోయినా ప్రజాసేవ చేస్తానని వ్యాఖ్య
Kesineni Nani response on praising YSRCP MLA Mondithoka Jaganmohan

వైసీపీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ ను టీడీపీ ఎంపీ కేశినేని నాని ప్రశంసించడం చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేశినేని నాని స్పందిస్తూ... మంచిపని చేసే వాళ్లను తాను అభినందిస్తానని చెప్పారు. మొండితోక జగన్మోహన్ తనకు నాలుగేళ్లుగా తెలుసని... మొండితోక బ్రదర్స్ మంచి వ్యక్తులని ప్రశంసించారు.

మైనింగ్, ఇసుకలో వాటాలు ఇవ్వకపోతే బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేసే వ్యక్తిని తాను కాదని అన్నారు. విజయవాడ పార్లమెంటు పరిధిలో ఎవరు మంచి చేసినా తాను ప్రశంసిస్తానని చెప్పారు. తెలంగాణ కోసం గొంగళి పురుగును కూడా ముద్దాడుతానని గతంలో కేసీఆర్ చెప్పారని.. విజయవాడ అభివృద్ధి కోసం తాను ముళ్లపందితోనైనా కలుస్తానని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తనకు ఎంపీ టికెట్ ఇవ్వకపోతే... కేశినేని భవన్ లో కూర్చొని ప్రజలకు సేవ చేస్తానని చెప్పారు. ఎంపీ పదవి ఉన్నా, లేకపోయినా ప్రజాసేవ చేస్తానని అన్నారు.

More Telugu News