రాజస్థాన్ రాయల్స్ లో వాటా కొనుగోలుకు విదేశీ సంస్థ ఆసక్తి
- చర్చలు నిర్వహిస్తున్న ప్రైవేటు ఈక్విటీ సంస్థ టైగర్ గ్లోబల్
- రూ.328 కోట్ల వరకు పెట్టుబడులకు ఆసక్తి
- డీల్ తుది దశలో ఉన్నట్లు సమాచారం
ఈ పెట్టుబడుల డీల్ ముగింపు దశలో ఉన్నట్టు ఈ వ్యవహారం తెలిసిన వర్గాలు వెల్లడించాయి. టైగర్ గ్లోబల్ కు మనదేశంలో ఎక్కువగా టెక్నాలజీ స్టార్టప్ లలోనే (జొమాటో, డెల్హివరీ, ఫ్లిప్ కార్ట్, ఓలా తదితర) పెట్టుబడులు ఉన్నాయి. మొదటి సారి ఐపీఎల్ పట్ల ఆసక్తి చూపిస్తోంది. రాజస్థాన్ రాయల్స్ లో 60 శాతం మేర వాటాలు బ్రిటన్ కు చెందిన మనోజ్ బండాలే ఆధ్వర్యంలోని ఎమర్జింగ్ మీడియా చేతిలో ఉన్నాయి. ఈ సంస్థ నుంచి టైగర్ గ్లోబల్ కొంత వాటా కొనుగోలు చేయబోతుందా? అన్నది చూడాల్సి ఉంది.
రాజస్థాన్ రాయల్స్ తోపాటు ఇతర ఫ్రాంచైజీలతోనూ టైగర్ గ్లోబల్ చర్చలు నిర్వహించినట్టు ఆ వర్గాలు తెలిపాయి. కానీ రాజస్థాన్ రాయల్స్ తోనే చివరికి ఒప్పందానికి రానుంది. ఆన్ లైన్ ఫాంటసీ గేమింగ్ కంపెనీ డ్రీమ్ స్పోర్ట్స్ లోనూ టైగర్ గ్లోబల్ కు వాటాలున్నాయి. గుజరాత్ టైటాన్స్ ను యూకేకు చెందిన సీవీసీ క్యాపిటల్ పార్ట్ నర్స్ అనే ప్రైవేటు ఈక్విటీ సంస్థ సొంతం చేసుకోవడం తెలిసిందే. 2022 నాటికి ఐపీఎల్ ఫ్రాంచైజీ (అన్నీ కలిపి) విలువ 10.9 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు కన్సల్టింగ్ సంస్థ డీ అండ్ పీ అడ్వైజరీ నివేదిక ఆధారంగా తెలుస్తోంది. 2020లో ఉన్న 6.2 బిలియన్ డాలర్లతో పోలిస్తే 75 శాతం పెరగడం గమనార్హం.