Narendra Modi: పపువా న్యూగినియాలో 14 దేశాధినేతలకు మోదీ ఇచ్చిన విందులో నోరూరించే వంటకాలు ఇవే!

  • ఇండియా-పసిఫిక్ ఐలాండ్స్ కోఆపరేషన్ సమ్మిట్ కు హాజరైన మన ప్రధాని 
  • నోరూరించే భారతీయ వంటకాలతో విందును ఏర్పాటు చేసిన మోదీ
  • సదస్సుకు హాజరైన నేతలకు ధన్యవాదాలు తెలిపిన ప్రధాని
Menu of PM Modi hosted lunch in FIPIC

పపువా న్యూగినియాలో జరుగుతున్న ఇండియా-పసిఫిక్ ఐలాండ్స్ కోఆపరేషన్ సమ్మిట్ కు ప్రధాని మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈ కూటమిలోని దేశాధినేతల, ప్రతినిధులకు మోదీ విందును ఏర్పాటు చేశారు. నోరూరించే భారతీయ వంటకాలను ఈ విందులో వడ్డించారు. గుజరాత్ రాష్ట్రానికి చెందిన ప్రఖ్యాత వంటకం ఖాండ్వీ, మలై ఖోఫ్తా, వెజిటబుల్ కొల్హాపురి, దాల్ పంచ్మెల్, రాగి గట్టా కర్రీ, మిల్లెట్ బిర్యానీ (చిరు ధాన్యాలతో చేసినది), మసాలా చాస్ (క్రీమీ యోగార్ట్, ఇండియన్ స్పైసెస్ తో చేసిన సమ్మర్ డ్రింక్), పాన్ కుల్ఫీ, మాల్పువా రబ్డీలతో పాటు పలు వంటకాలను అతిథులకు వడ్డించారు. దీంతో పాటు మసాలా టీ, గ్రీన్ టీ, మింట్ టీ (పుదీనా)లను సర్వ్ చేశారు. 

మరోవైపు ఇండియా-పసిఫిక్ ఐలాండ్స్ కూటమిలో భారత్ తో పాటు 14 పసిఫిక్ ద్వీపాలు ఉన్నాయి. 2014లో తన ఫిజి పర్యటన సందర్భంగా ఈ కూటమిని మోదీ ఏర్పాటు చేశారు. ఈ కూటమిలో కుక్ ఐలాండ్స్, ఫిజి, కిరిబటి, రిపబ్లిక్ ఆఫ్ మార్షల్ ఐలాండ్స్, మైక్రోనేషియా, నౌరూ, నియూ, పలావూ, పవువా న్యూగినియా, సమోవా, సోలోమన్ ఐలాండ్స్, టోంగా, తువాలు, వనుయాటు దేశాలు ఉన్నాయి. మరోవైపు ఈ సందర్భంగా ట్విట్టర్ ద్వారా మోదీ స్పందిస్తూ... తమ ఆహ్వానాన్ని గౌరవించి సదస్సుకు హాజరైన 14 దేశాల అధినేతలకు ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు.

More Telugu News